భరత్ రిటైర్మెంట్ ప్రకటించడంతో షాక్కు గురయ్యా: ఎంఎస్కే ప్రసాద్
- 32 ఏళ్లకే ఆటకు వీడ్కోలు పలకడం ఆశ్చర్యపరిచిందన్న ప్రసాద్
- అతడిని ఒప్పించేందుకు ప్రయత్నించానన్న ప్రసాద్
- అండర్-13 రోజుల నుంచి అతడిని చూస్తున్నానని వెల్లడి
భరత్ తీసుకున్న ఈ నిర్ణయం తనను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసిందని టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ పేర్కొన్నాడు. ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ, "భరత్ రిటైర్మెంట్ గురించి విని నేను విస్మయానికి గురయ్యాను. తనతో మాట్లాడి నిర్ణయాన్ని మార్చుకోవాలని నా వంతు ప్రయత్నం చేశాను. కానీ, రిటైర్ కావాలనే నిశ్చయంతో ఉన్నట్లు భరత్ నాతో కచ్చితంగా చెప్పాడు. చిన్నప్పటి నుంచి అతడి ఎదుగుదలను గమనిస్తున్న నాకు ఇది నిజంగా దిగ్భ్రాంతికరమైన విషయం" అని వివరించాడు. భరత్లో ఇంకా క్రికెట్ ఆడే సత్తా పుష్కలంగా ఉందని, అయితే అతడి వ్యక్తిగత నిర్ణయాన్ని గౌరవించాల్సిందేనని ఎమ్మెస్కే అభిప్రాయపడ్డాడు.
భరత్ను తాను అండర్-13 స్థాయి నుంచి గమనిస్తున్నానని ఎమ్మెస్కే తెలిపాడు. తాను కూడా 31 ఏళ్ల వయస్సులోనే రిటైర్మెంట్ ప్రకటించానని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్న ఎమ్మెస్కే... బహుశా భరత్ తన జీవితంలోని ఇతర అంశాలపై దృష్టి సారించాలనుకుంటున్నాడేమోనని వ్యాఖ్యానించాడు. భరత్ను ఒప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, అతడు మాత్రం తన నిర్ణయంపై ఎంతో పట్టుదలగా ఉన్నాడని ఎమ్మెస్కే ప్రసాద్ స్పష్టం చేశాడు.