ఏపీ రాజ్యసభ సీట్ల పంపకం పూర్తి.. టీడీపీకి 3, జనసేనకు 1
- రాజ్యసభ సీట్ల పంపకాలపై కొలిక్కి వచ్చిన ఫార్ములా
- టీడీపీకి మూడు, జనసేనకు ఒక స్థానం కేటాయింపు
- ఈసారి బీజేపీకి దక్కని రాజ్యసభ అవకాశం
- సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన సమావేశంలో తుది నిర్ణయం
- జూన్ 18న నాలుగు స్థానాలకు జరగనున్న పోలింగ్
ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో గురువారం జరిగిన కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ పాల్గొన్నారు. ఈ భేటీలో మిత్రపక్ష నేతలతో చర్చించిన అనంతరం, సీట్ల కేటాయింపు నిర్ణయాన్ని సీఎం స్వయంగా వెల్లడించారు. మూడు పార్టీల నేతల ఏకాభిప్రాయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. త్వరలోనే రాజ్యసభ అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న సంఖ్యా బలం ఆధారంగానే ఈ కేటాయింపులు జరిపినట్లు స్పష్టమవుతోంది. అసెంబ్లీలో టీడీపీకి భారీ మెజారిటీ ఉండగా, జనసేనకు 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
షెడ్యూల్ ప్రకారం జూన్ 18న నాలుగు రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం వైసీపీకి చెందిన మూడు, టీడీపీకి చెందిన ఒక స్థానం ఖాళీ అవుతున్నాయి. అసెంబ్లీలో ఎన్డీఏ కూటమికి ఉన్న పూర్తి ఆధిక్యతతో ఈ నాలుగు స్థానాలనూ గెలుచుకోవడం లాంఛనప్రాయమే.
కాగా, నేటి ఎన్డీయే సమావేశంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు మూడు ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా జూన్ 9న తిరుపతిలో 'సంక్షేమం', 12న అమరావతిలో 'సుపరిపాలన', 15న విశాఖపట్నంలో 'అభివృద్ధి' అనే అంశాలపై సభలు జరపాలని చంద్రబాబు సూచించారు.