చరణ్ పై వీరాభిమానం... 'పెద్ది' చూసేందుకు జపాన్ నుంచి వచ్చారు!
- 'పెద్ది' సినిమా కోసం జపాన్ నుంచి హైదరాబాద్కు అభిమానులు
- టోక్యోకు చెందిన ఇద్దరు యువతులు నగరానికి రాక
- దాదాపు 10 షోలు చూసేందుకు ప్లాన్ చేసుకున్న ఫ్యాన్స్
- ఆర్ఆర్ఆర్ తర్వాత జపాన్లో చరణ్కు పెరిగిన ఫాలోయింగ్
మసామి, క్రిస్ అనే ఈ ఇద్దరు అభిమానులు ఐదు రోజుల పాటు తమ ఉద్యోగాలకు సెలవు పెట్టి, సినిమా విడుదలకు రెండు రోజుల ముందే నగరానికి చేరుకున్నారు. తమ స్నేహితురాలు కన్మణి సహాయంతో హైదరాబాద్లోని మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సందడి చేస్తున్నారు. భారతీయ ప్రేక్షకులతో కలిసి సినిమా చూస్తూ పండగ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. పర్యటన ముగిసేలోపు దాదాపు 10 షోలు చూడాలని వారు ప్లాన్ చేసుకున్నారు.
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' నేడు (జూన్ 4) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో చరణ్ సరసన జాన్వీ కపూర్ నటించగా, శివ రాజ్కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. 'ఆర్ఆర్ఆర్' చిత్రం తర్వాత జపాన్లో రామ్ చరణ్కు విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. వాస్తవానికి 'పెద్ది' చిత్రాన్ని జపాన్లో కూడా ఒకేసారి విడుదల చేయాలని భావించినా, సాంకేతిక కారణాలతో చివరి నిమిషంలో అది రద్దయింది. దీంతో నిరాశ చెందకుండా, తమ అభిమాన నటుడి సినిమాను మొదటి రోజే చూసేందుకు వారు నేరుగా హైదరాబాద్కే విమానంలో రావడం విశేషం.