రేపు విశాఖకు సీఎం చంద్రబాబు... ఆక్వా ఎగుమతులపై జాతీయ వర్క్‌షాప్

Chandrababu will tour Vizag tomorrow
  • విశాఖ నగరంలో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
  • సీఫుడ్ ఎగుమతులపై జాతీయ సదస్సులో పాల్గొననున్న సీఎం
  • కేంద్ర మంత్రులతో కలిసి వర్క్‌షాప్‌లో ప్రసంగించనున్న చంద్రబాబు
  • పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్ యాత్ర, మొక్కలు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై నగరంలో జరగనున్న కీలకమైన జాతీయ సదస్సుకు ఆయన హాజరుకానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం సైకిల్‌పై ప్రయాణించడం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

అధికారిక పర్యటన వివరాల ప్రకారం, సీఎం చంద్రబాబు శుక్రవారం ఉదయం 8:30 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి 10:00 గంటలకు విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. అక్కడ 'నెట్ జీరో' కార్యక్రమంలో భాగంగా మొక్కను నాటి, అనంతరం బీచ్ రోడ్డులోని నోవోటెల్ హోటల్ వరకు సైకిల్‌పై ప్రయాణిస్తారు. హోటల్‌లో జరిగే జాతీయ సీఫుడ్ ఎక్స్‌పోర్ట్స్ వర్క్‌షాప్‌లో పాల్గొంటారు. ఈ సదస్సుకు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, చిరాగ్ పాశ్వాన్, రాజీవ్ రంజన్ సింగ్, జార్జ్ కురియన్, ఎస్పీ సింగ్ భగేల్ వంటి ప్రముఖులు హాజరుకానున్నారు.

ఈ వర్క్‌షాప్‌లో ఆక్వాకల్చర్, మత్స్య రంగంలో అవకాశాలు, స్టార్టప్‌లకు ప్రోత్సాహం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్‌తో పాటు ఇతర అంతర్జాతీయ మార్కెట్లకు మన ఉత్పత్తులను ఎగుమతి చేయడం, ఎదురవుతున్న సవాళ్లు, ప్రత్యామ్నాయ మార్కెట్లపై దృష్టి సారించనున్నారు. ట్రేసబిలిటీ వ్యవస్థలను పటిష్ఠం చేయడం, ఆక్వాకల్చర్‌లో సర్టిఫికేషన్ విధానాలను ప్రోత్సహించడం ద్వారా స్థిరమైన పద్ధతులను అవలంబించడంపై చర్చిస్తారు. అలాగే, డీప్ సీ ఫిషింగ్, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ వంటి ప్రాంతాల్లోని అధిక విలువ కలిగిన మత్స్య సంపద వినియోగం, సీవీడ్, ముత్యాల పెంపకం వంటి నూతన రంగాల అభివృద్ధిపై కూడా ఈ సదస్సులో కీలక చర్చ జరగనుంది.

విలువ జోడించిన ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రాజెక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) స్కీమ్, ఎంఎస్ఎంఈలకు లభించే మద్దతుపై కూడా ఈ వర్క్‌షాప్‌లో వివరించనున్నారు. ఈ సందర్భంగా పీఎంకేఎస్‌ఎస్‌వై (PMKSSY), కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) పథకాల లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు ప్రోత్సాహకాలను అందజేస్తారు. సదస్సు ముగిసిన అనంతరం, విశాఖ ఎకనమిక్ రీజియన్‌పై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. తన పర్యటన ముగించుకుని సాయంత్రం తిరిగి అమరావతికి పయనమవుతారు.


Go Back to Shorts
Chandrababu
Vizag
Aqua Seminar
TDP
Andhra Pradesh

More Telugu News