దేశరక్షణ కోసం 'ధర్మ హింస' అవసరమే: యోగి ఆదిత్యనాథ్
- కేవలం అహింసతోనే సమస్యలు పరిష్కారం కావన్న ఆదిత్యనాథ్
- దేశాన్ని, ధర్మాన్ని కాపాడేందుకు ధర్మ హింస కూడా అవసరమేనని వ్యాఖ్య
- సైనికుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచన
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దేశ భద్రత, అహింస, ధర్మరక్షణపై కీలక వ్యాఖ్యలు చేశారు. లక్నోలో నిర్వహించిన ‘నౌసేన శౌర్య వాటిక’ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ... అహింస మానవాళికి పరమ ధర్మమే అయినప్పటికీ, దేశానికి లేదా సమాజానికి ఎవరైనా ముప్పుగా మారినప్పుడు కేవలం అహింసతోనే సమస్యలు పరిష్కారం కావని స్పష్టం చేశారు. దేశాన్ని, ధర్మాన్ని కాపాడే క్రమంలో అవసరమైతే బలప్రయోగం లేదా ‘ధర్మ హింస’ చేయడం కూడా అంతే ముఖ్యమన్నారు.
బలహీనులను ప్రపంచం ఎప్పుడూ గౌరవించదని, భద్రతాపరంగా శక్తివంతమైన దేశాలతోనే ఇతర దేశాలు స్నేహాన్ని కోరుకుంటాయని యోగి పేర్కొన్నారు. శాంతిభద్రతలు సజావుగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని చెబుతూ.. 2017కు ముందు యూపీలో మాఫియా ఆధిపత్యం, నేరాలు ఎక్కువగా ఉండేవని, బీజేపీ పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా మెరుగయ్యాయని గుర్తుచేశారు. దేశ సరిహద్దుల్లో అహర్నిశలు శ్రమిస్తూ భారతదేశాన్ని కాపాడుతున్న సైనికుల త్యాగాలను గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత అని సీఎం యోగి ఆదిత్యనాథ్ పిలుపునిచ్చారు.