గాదె వెంకటరెడ్డి మృతిపై రేవంత్ సంతాపం
- వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన గాదె వెంకటరెడ్డి
- రాజకీయాల్లో అత్యంత సౌమ్యుడు అని కితాబునిచ్చిన రేవంత్
- రాజకీయాల్లో ఆయన లేని లోటు తీర్చలేనిదని వ్యాఖ్య
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు గాదె వెంకటరెడ్డి (85) మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, శుక్రవారం హైదరాబాద్లోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
గాదె వెంకటరెడ్డి రాజకీయాల్లో అత్యంత సౌమ్యుడు, సహనశీలిగా పేరుగాంచారని, ఆయన హయాంలో ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టారని రేవంత్ కొనియాడారు. ఉమ్మడి రాష్ట్ర శాసనసభకు ఐదుసార్లు ప్రాతినిథ్యం వహించిన ఆయన, మంత్రిగా వివిధ శాఖలను సమర్థవంతంగా నిర్వహించారని గుర్తుచేసుకున్నారు. రాజకీయాల్లో ఆయన లేని లోటు తీర్చలేనిదని సీఎం పేర్కొన్నారు.
ఉమ్మడి ఏపీలో అగ్ర నేతలైన నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి, కొణిజేటి రోశయ్యల మంత్రివర్గాల్లో దేవాదాయ శాఖతో పాటు పలు కీలక శాఖల మంత్రిగా ఆయన సమర్థవంతంగా సేవలందించారు. కాంగ్రెస్ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ, వైసీపీలలో కూడా కొనసాగారు. ఒక విలువలతో కూడిన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని ముగించి నిష్క్రమించిన గాదె వెంకటరెడ్డి మృతి పట్ల రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ, సామాజిక రంగాల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.