అంతర్రాష్ట్ర జలవివాదాలు.. కెన్-బెట్వా ప్రాజెక్టును ఉదహరించిన ప్రధాని మోదీ

Narendra Modi cites Ken Betwa project on water disputes
  • జలవివాదాలను సహకార ధోరణితో పరిష్కరించుకోవాలని సూచన
  • సకాలంలో అనుమతులు, సాంకేతిక ఆధారిత పర్యవేక్షణ ద్వారా సమస్యలను అధిగమించాలన్న మోదీ
  • ఆయా రాష్ట్రాల్లోని రూ.30 వేల కోట్ల అభివృద్ధి పనులపై సమీక్ష
అంతర్రాష్ట్ర జల వివాదాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక సూచన చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. జల వివాదాలను సహకార ధోరణితో పరిష్కరించుకోవాలని రాష్ట్రాలకు సూచించారు. సకాలంలో అనుమతులు, సాంకేతిక ఆధారిత పర్యవేక్షణ ద్వారా ఈ సమస్యలను అధిగమించాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన కెన్-బెట్వా ప్రాజెక్టు నమూనాను ఉదహరించారు.

భారతదేశంలో మొట్టమొదటి నదుల అనుసంధాన ప్రాజెక్టు కెన్-బెట్వా ప్రాజెక్టు. మధ్యప్రదేశ్‌లోని కెన్ నదిలో ఉన్న అదనపు జలాలను కాలువ ద్వారా ఉత్తరప్రదేశ్‌లోని బెట్వా నదికి మళ్లిస్తారు. ఈ నేపథ్యంలో మోదీ మాట్లాడుతూ, రాష్ట్రాల మధ్య నీటి సమస్యల పరిష్కారానికి ఇది ఆదర్శ మోడల్‌గా పేర్కొన్నారు.

ప్రధాని మోదీ కెన్ - బెట్వా నదుల అనుసంధాన ప్రాజెక్టు సహా ఆయా రాష్ట్రాల్లో రూ.30 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల అమలులో జాప్యం, ఖర్చుల పెరుగుదలకు దారితీయడమే కాకుండా, పౌరులకు అవసరమైన సౌకర్యాలను సకాలంలో అందకుండా చేస్తుందని మోదీ వ్యాఖ్యానించారు.

నీటి భద్రత కోసం నదుల అనుసంధానం, జల సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవం వంటి అంశాల్లో అవకాశాలను గుర్తించాలని సూచించారు. స్వచ్ఛ భారత్ మిషన్ - అర్బన్ 2.0ను కూడా సమీక్షించారు. ఆయా నగరాల్లో రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు మార్గాలను అన్వేషించాలని అన్నారు. పెండింగ్ సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత చురుకుగా పనిచేయాలని ప్రధాని మోదీ సూచించారు.
Go Back to Shorts
Narendra Modi
Interstate water disputes
Ken Betwa project
River linking project
Water management

More Telugu News