మీ వైఫల్యాలను కేంద్రంపై నెట్టడం సరికాదు: రేవంత్ రెడ్డిపై ధర్మపురి అర్వింద్ ఫైర్
- తెలంగాణలో దుమారం రేపుతున్న ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం
- రైతుల ధాన్యం తరలించడానికి లారీలు దొరకడం లేదా అని అర్వింద్ ఫైర్
- సీఎం కేవలం విమర్శలకే పరిమితం అయ్యారని విమర్శ
తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఘాటుగా స్పందించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ.. పాలన చేతకాకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి అంటూ రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు.
బీజేపీ నేతల ఇళ్ల ముందు ధాన్యం పోస్తామన్న సీఎం వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని అర్వింద్ మండిపడ్డారు. వరి కోతలు ప్రారంభం కాకముందే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సింది పోయి, తన వైఫల్యాలను కేంద్రంపై నెట్టడం సరికాదన్నారు. "దొంగ ఇసుక, మొరం రవాణాకు లారీలు, ట్రాక్టర్లు అందుబాటులో ఉంటాయి కానీ.. రైతుల ధాన్యం తరలించడానికి మాత్రం లారీలు దొరకవా?" అంటూ ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్సీఐకి లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం బకాయి పడిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న 'ఫ్యూచర్ సిటీ' ప్రాజెక్టుపైనా ఆయన విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం ఉన్న నగర సమస్యలను గాలికొదిలేసి, కొత్త నగరాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. నిరుద్యోగ భృతి, గ్రామీణ అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని ఎండగట్టారు. సీఎం ఇప్పటివరకు తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్రం ముందు బలమైన వాదన వినిపించలేదని, కేవలం విమర్శలకే పరిమితమయ్యారని ధ్వజమెత్తారు.