ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదం: వాష్రూంలో ఒకరినొకరు హత్తుకుని కన్నుమూసిన జంట!
- ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో హృదయ విదారక ఘటన
- మంటల నుంచి తప్పించుకున్నా పొగకు బలైన వైనం
- సహాయక సిబ్బందికి కంటతడి పెట్టించిన దృశ్యం
"గ్రౌండ్ ఫ్లోర్లోని ఓ వాష్రూం లోపలి నుంచి గడియ పెట్టి ఉండటంతో, తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లాం. అక్కడ ఓ జంట ఒకరినొకరు హత్తుకుని చనిపోయి ఉన్నారు" అని కళ్లారా చూసిన దృశ్యాన్ని సహాయక చర్యల్లో పాల్గొన్న షోయబ్ అనే వ్యక్తి వివరించాడు. "ఆ మహిళ టాయిలెట్ సీటుపై కూర్చుని ఉండగా, ఆమె పక్కనే కుర్చీలో ఉన్న వ్యక్తి ఆమెను గట్టిగా పట్టుకుని ఉన్నారు. మంటల నుంచి తప్పించుకునేందుకు వారు లోపల లాక్ చేసుకుని ఉంటారు" అని తెలిపాడు.
దక్షిణ ఢిల్లీలోని మాల్వియా నగర్లో ఉన్న ఫ్లరిష్ స్టే బెడ్ అండ్ బ్రేక్ ఫాస్ట్ హోటల్లో బుధవారం ఉదయం జరిగిన ఈ దుర్ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 12 మంది విదేశీయులు ఉన్నారు. వీరిలో చాలామంది సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మెడికల్ టూరిస్టులు కావడం గమనార్హం.
బుధవారం ఉదయం 8:48 గంటల సమయంలో హోటల్ బేస్మెంట్లోని రెస్టారెంట్లో మంటలు మొదలయ్యాయి. చూస్తుండగానే దట్టమైన పొగ భవనం పై అంతస్తులకు వేగంగా వ్యాపించింది. బాధితుల్లో ఎక్కువ మంది మంటల కారణంగా కాకుండా పొగతో ఊపిరాడి మరణించినట్లు రెస్క్యూ సిబ్బంది తెలిపింది.
పోలీసుల దర్యాప్తులో భవనానికి ఫైర్ సేఫ్టీ అనుమతులు లేవని, ఆరు గదులకు బదులుగా 25 గదులు నడుపుతున్నారని తేలింది. భవనానికి ఒకే ద్వారం ఉండటం, కిటికీలు సీల్ చేసి ఉండటంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు భవన యజమానిని అరెస్టు చేశారు.