విదేశీయుల వివరాలు 24 గంటల్లో ఇవ్వాలి: హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక
- హైదరాబాద్లో బస చేసే విదేశీయుల వివరాలు 24 గంటల్లో సమర్పించాలి
- ఇమ్మిగ్రేషన్ చట్టం 2025 ప్రకారం పోలీసుల తాజా అడ్వైజరీ
- నిబంధనలు పాటించని యజమానులు, విద్యాసంస్థలపై కఠిన చర్యలు
- విదేశీయుల కదలికలపై నిఘా పెంచడమే లక్ష్యమన్న పోలీసులు
- హోటళ్లు, హాస్టళ్లు, ఇంటి యజమానులందరికీ ఈ నిబంధన వర్తింపు
గోల్కొండ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) జూన్ 3న ఈ సూచనలు జారీ చేశారు. హోటళ్లు, లాడ్జీలు, గెస్ట్ హౌస్లు, అద్దె ఇళ్ల యజమానులు, ఆసుపత్రులు, విశ్వవిద్యాలయాలు, కళాశాలలు సహా విదేశీయులకు ఆశ్రయం కల్పించే వారందరూ ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.
విదేశీ పాస్పోర్ట్ హోల్డర్లు, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డు ఉన్నవారు, నేపాల్ జాతీయులతో సహా ఏ విదేశీయుడు తమ ప్రాంగణంలో బస చేసినా, నిర్దేశిత ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఫారం-III (ఫారం-సి) సమర్పించాలి. విద్యాసంస్థలు విదేశీ విద్యార్థుల వివరాలను ఫారం-IIలో నమోదు చేయాలి. వారు తిరిగి వెళ్లిన వివరాలను కూడా రిపోర్ట్ చేసి, ఆ రికార్డులను కనీసం ఏడాది పాటు భద్రపరచుకోవాలి.
2025 సెప్టెంబర్లో అమల్లోకి వచ్చిన కొత్త ఇమ్మిగ్రేషన్ చట్టం అమలులో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు పోలీసులు తెలిపారు. దేశంలో విదేశీయుల కదలికలపై పర్యవేక్షణను పటిష్టం చేయడమే దీని లక్ష్యం. తప్పుడు సమాచారం ఇచ్చినా లేదా వాస్తవాలను దాచిపెట్టినా చట్ట ప్రకారం శిక్షార్హులవుతారని స్పష్టం చేశారు. ఎలాంటి చట్టపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు అందరూ ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాలని పోలీసులు కోరారు.