ఆఫ్ఘనిస్థాన్తో ఏకైక టెస్టు.. చండీగఢ్ చేరుకున్న టీమిండియా
- శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో బరిలోకి దిగనున్న టీమిండియా
- జట్టుతో పాటు కెప్టెన్ గిల్, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, పంత్, నితీశ్ రెడ్డి
- గత ఏడాది సౌతాఫ్రికా చేతిలో ఓటమి తర్వాత భారత్ ఆడుతున్న తొలి టెస్ట్
- 2018 తర్వాత భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్ ఇది
నగరానికి చేరుకున్న భారత జట్టు నేరుగా టీమ్ హోటల్కు వెళ్లింది. కెప్టెన్ శుభ్మన్ గిల్తో పాటు కొత్తగా వైస్ కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన కేఎల్ రాహుల్, వికెట్ కీపర్-బ్యాటర్ రిషభ్ పంత్, యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి తదితరులు జట్టుతో పాటు కనిపించారు. రాబోయే రోజుల్లో జట్టు ప్రాక్టీస్ సెషన్లను ప్రారంభించనుంది.
గత ఏడాది స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్లో 2-0 తేడాతో ఓటమి పాలైన తర్వాత భారత్ ఆడుతున్న తొలి టెస్టు మ్యాచ్ ఇదే. ఈ మ్యాచ్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) పరిధిలోకి రానప్పటికీ, ఈ ఏడాది చివర్లో శ్రీలంక, న్యూజిలాండ్ పర్యటనలకు సన్నాహకంగా ఇది టీమిండియాకు చాలా కీలకం. అనుభవం, యువ ప్రతిభ కలయికతో ఉన్న ఈ జట్టుతో టెస్టుల్లో తిరిగి లయను అందుకోవాలని భారత్ భావిస్తోంది.
భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య టెస్టుల్లో ఇది రెండో ముఖాముఖి. 2018లో బెంగళూరు వేదికగా ఆఫ్ఘనిస్థాన్ తమ అరంగేట్ర టెస్టును భారత్తోనే ఆడింది. ఆ మ్యాచ్లో భారత్ కేవలం రెండు రోజుల్లోనే ఇన్నింగ్స్ 262 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఎనిమిదేళ్ల తర్వాత ఈ రెండు జట్లు మళ్లీ టెస్టు ఫార్మాట్లో తలపడబోతున్నాయి.