ఈ ప్రచారంలో నేను కూడా పాల్గొంటాను... వీలుంటే ఈ-సైకిళ్లు ఉపయోగిద్దాం: చంద్రబాబు
- ఓటర్ల జాబితా స్పెషల్ రివిజన్పై అప్రమత్తంగా ఉండాలని కేడర్కు సూచన
- ప్రభుత్వ పథకాలపై జూన్ 25 నుంచి 45 రోజుల పాటు ఇంటింటి ప్రచారానికి పిలుపు
- తాను కూడా సైకిల్పై ప్రచారంలో పాల్గొంటానని వెల్లడి
- వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా మిగలొద్దు.. మళ్లీ మళ్లీ గెలవాలని హితవు
మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)పై జరిగిన రాష్ట్రస్థాయి వర్క్షాప్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు.
సైకిల్ పవర్ చూపుదాం.. ప్రజలకు చేరువవుదాం
ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని చంద్రబాబు సూచించారు. "జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు, 45 రోజుల పాటు ఇంటింటి ప్రచారం చేపట్టాలి. రెండేళ్లలో ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రతి గడపకు వివరించాలి. ఈ ప్రచారంలో భాగంగా సైకిళ్ల మీద వెళ్లి ప్రజలను కలవాలి. వీలైతే ఈ-సైకిళ్లు వాడాలి. నేను కూడా సైకిల్ మీదే ప్రచారంలో పాల్గొంటాను" అని ప్రకటించారు. ప్రధానిగా మోదీ 12 ఏళ్లు పూర్తి చేసుకోవడం, తాను నాలుగోసారి సీఎంగా కొనసాగడం వంటి అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల విజయాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని ఆదేశించారు.
కార్యకర్తల సంక్షేమమే పార్టీకి ముఖ్యం
టీడీపీ అనేది అందరి పార్టీ అని, ప్రతి వర్గాన్ని ఓన్ చేసుకోవాలని చంద్రబాబు అన్నారు. "సోషల్ రీ-ఇంజనీరింగ్తో పదవులు, సీట్లు కేటాయించాం. నామినేటెడ్ పదవుల్లోనూ ఇదే సూత్రాన్ని పాటిస్తున్నాం. కార్యకర్తల సాధికారత, సంక్షేమం గురించి ఆలోచించే ఏకైక పార్టీ టీడీపీ. మరణించిన కార్యకర్తల కుటుంబాలకు రూ. 5 లక్షల బీమా, వారి పిల్లల చదువులకు ప్రత్యేక పాఠశాల, నైపుణ్య శిక్షణతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. ప్రతి కార్యకర్త ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతైనా ఖర్చు చేస్తాం" అని భరోసా ఇచ్చారు. నాయకులు కూడా కార్యకర్తలను ఆదుకునే విషయంలో ఇదే విధంగా ఆలోచించాలని సూచించారు. గత ప్రభుత్వంలో విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెడుతున్నామని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో రాష్ట్రానికి పోయిన బ్రాండ్ను తిరిగి తీసుకొచ్చామని తెలిపారు.
వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా మిగలొద్దు
కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలకు ఆయన కీలక సూచనలు చేశారు. "కొత్త ఎమ్మెల్యేలు వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా మిగిలిపోకూడదు. మళ్లీ మళ్లీ గెలవాలి. అభివృద్ధి, సుపరిపాలనతో పాటు ప్రజాప్రతినిధుల వ్యవహార శైలి కూడా ఓట్లను ప్రభావితం చేస్తుంది. ప్రజల కోసం ఎంత పని చేసినా నోరు అదుపులో పెట్టుకోకుంటే నష్టం జరుగుతుంది. కార్యకర్త నుంచి నాయకుడి వరకు ప్రతి ఒక్కరికీ క్యారెక్టర్, ట్రస్ట్ చాలా ముఖ్యం," అని హితవు పలికారు.