రాజధానికి పట్టిన గ్రహణం వీడింది.. ఇంటింటా దీపాలు వెలిగించి సంబరాలు జరుపుకుందాం: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh Calls for Celebrations as Amaravati Gets Legal Backing
  • అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లుకు ఆమోదం
  • ఇంటింటా దీపాలు వెలిగించి సంబరాలు జరుపుకోవాలని లోకేశ్ పిలుపు
  • #APThanksIndia హ్యాష్‌ట్యాగ్‌తో పోస్టులు పెట్టాలని సూచన
  • రాజ్యసభలో బిల్లు పాసయ్యాక ఎంపీలతో మంత్రి లోకేశ్ భేటీ
  • రాష్ట్రపతి ఆమోదం తర్వాత గెజిట్ విడుదల చేయనున్న కేంద్రం
ఏపీ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టపరమైన హామీ లభించింది. ఈ మేరకు ప్రవేశపెట్టిన ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదముద్ర వేశాయి. ఈ చారిత్రాత్మక పరిణామం నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని మంత్రి నారా లోకేశ్‌ పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్ర ప్రజలు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు.

ఈ విషయంపై మంత్రి నారా లోకేశ్ ఎక్స్ (X) వేదికగా స్పందిస్తూ... "రాజధానికి పట్టిన గ్రహణం వీడి, ప్రజా రాజధానికి చట్టబద్ధత లభించింది" అని హర్షం వ్యక్తం చేశారు. ఈ చారిత్రాత్మక విజయాన్ని పురస్కరించుకుని నేడు రాత్రి 7 గంటలకు ప్రతి ఇంటి ముందు దీపాలు వెలిగించి వేడుకలు జరుపుకోవాలని ప్రజలను కోరారు. దీపాలతో సెల్ఫీ తీసుకుని ‘మన రాజధాని మన గౌరవం’ అంటూ #APThanksIndia హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని సూచించారు.

బిల్లుపై చర్చ జరిగిన సమయంలో రాజ్యసభ గ్యాలరీ నుంచి లోకేశ్ ప్రక్రియను పర్యవేక్షించారు. బిల్లు ఆమోదం పొందాక, దీనికి సహకరించిన పలు పార్టీల ఎంపీలను ఆయన నేరుగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం రాజ్యసభ క్యాంటీన్‌లో వారితో భేటీ అయ్యారు.

గురువారం రాజ్యసభలో ఈ బిల్లుపై దాదాపు రెండు గంటల పాటు చర్చ జరిగాక ఆమోదం లభించింది. తదుపరి ప్రక్రియలో భాగంగా కేంద్ర కేబినెట్ దీనికి పోస్ట్ ఫ్యాక్టో ర్యాటిఫికేషన్ చేసి, రాష్ట్రపతి ఆమోదానికి పంపనుంది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో అమరావతికి చట్టబద్ధత ప్రక్రియ పూర్తవుతుంది.
Go Back to Shorts
Nara Lokesh
Amaravati
AP Reorganisation Act
Andhra Pradesh
AP Capital
Parliament
APThanksIndia
Andhra Pradesh Politics
Capital City
Nara Lokesh News

More Telugu News