తెలంగాణ ఆర్ఆర్ఆర్: దక్షిణ భాగానికి కేంద్రం ఓకే.. మంత్రి గడ్కరీ లేఖ

  • డీపీఆర్ తయారీకి కన్సల్టెన్సీని నియమించిన కేంద్ర ప్రభుత్వం
  • మంత్రి కోమటిరెడ్డికి లేఖ ద్వారా అధికారికంగా తెలిపిన నితిన్ గడ్కరీ
  • రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే ప్రాజెక్ట్ అన్న మంత్రి కోమటిరెడ్డి
తెలంగాణ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగం నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) తయారీ ప్రక్రియను ప్రారంభించినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ.. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నిన్న లేఖ రాశారు.

ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు కేంద్రం సానుకూలంగా స్పందించిందని, డీపీఆర్ రూపకల్పన కోసం ఇప్పటికే ఒక ప్రత్యేక కన్సల్టెన్సీని కూడా నియమించినట్లు గడ్కరీ తన లేఖలో పేర్కొన్నారు. ఈ పరిణామంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు.

శ్రీరామనవమి సందర్భంగా ఇది తెలంగాణ ప్రజలకు శుభవార్త అని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ ప్రాజెక్టు రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్నే మార్చే 'గేమ్ ఛేంజర్' అవుతుందని అన్నారు. తమ విజ్ఞప్తిని మన్నించిన కేంద్ర మంత్రి గడ్కరీకి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
 

Nitin Gadkari
Telangana RRR
Regional Ring Road
Komatireddy Venkat Reddy
Telangana
National Highways
Revanth Reddy
Road Development
Infrastructure Project
DPR

More Telugu News