మార్కాపురంలో ఘోర ప్రమాదం .. 10 మంది సజీవదహనం

  • హైదరాబాద్ నుంచి పామూరు వెళ్తుండగా ఘటన
  • టిప్పర్ లారీని ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు
  • బస్సు డీజిల్ ట్యాంక్ పేలడంతో చెలరేగిన మంటలు
  • మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆందోళన
ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈరోజు తెల్లవారుజామున ప్రైవేట్ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో 10 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా పామూరుకు సుమారు 40 మంది ప్రయాణికులతో ఒక ప్రైవేట్ బస్సు బయలుదేరింది. మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలోని క్వారీల వద్దకు రాగానే, ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీని బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు బస్సు డీజిల్ ట్యాంక్ పగిలిపోయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వేగంగా వ్యాపించిన మంటల్లో బస్సు, టిప్పర్ రెండూ చిక్కుకున్నాయి.

ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండటంతో ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కొందరు ప్రయాణికులు బస్సు అద్దాలు పగలగొట్టుకుని బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే, 10 మంది మాత్రం మంటల్లో చిక్కుకుని బయటకు రాలేక సజీవ దహనమయ్యారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. క్షతగాత్రులను మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో వారిని గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Markapuram Accident
Andhra Pradesh accident
bus accident
lorry collision
road accident
passenger bus
private bus
fire accident
fatal accident
Rayavaram

More Telugu News