ఇండియన్ కలినరీ ఇనిస్టిట్యూట్‌తో ఏపీ పర్యాటక శాఖ ఎంఓయూ

  • ముఖ్యమంత్రి సమక్షంలో కుదిరిన చారిత్రాత్మక ఒప్పందం
  • తెలుగు రుచులను ప్రపంచానికి పరిచయం చేయడంలో వర్సిటీ సహకారం
  • ఏపీని కలినరీ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దడానికి దోహదపడనున్న ఎంఓయూ
ఆంధ్రప్రదేశ్ ను కలినరీ టూరిజం హబ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ తిరుపతిలోని ఇండియన్ కలినరీ ఇనిస్టిట్యూట్ తో అవగాహనా ఒప్పందం చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో ఈ కీలకమైన ఎంఓయూ కుదిరింది. ఇండియన్ కలినరీ ఇనిస్టిట్యూట్ ప్రతినిధులు-ఏపీ పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్‌లు ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.

తెలుగు రుచులను, వంటకాలను ప్రపంచానికి పరిచయం చేయటంతో పాటు ప్రాంతీయ ఆహార సంస్కృతిని చాటి చెప్పేలా ఇండియన్ కలినరీ ఇనిస్టిట్యూట్ సహకారం అందించనుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ను కలినరీ టూరిజానికి ఓ కీలకమైన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు వీలుగా ఈ ఎంఓయూ తోడ్పడనుంది.

ప్రత్యేకించి కలినరీ విభాగంలో నైపుణ్యాభివృద్ధి కల్పన, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ నిర్వహించే ఫుడ్ ఫెస్టివల్స్, టూరిజం ఈవెంట్లను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా తెలుగు వంటకాల రుచులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలియచేసేలా కార్యాచరణ చేపట్టనున్నారు. ఈ అవగాహనా ఒప్పందం కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, ఏపీ హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Andhra Pradesh Tourism
Culinary Tourism
Indian Culinary Institute
Andhra Pradesh
Food Festivals

More Telugu News