ఢిల్లీలోని పార్టీ ఆఫీసు ఖాళీ చేయాలంటూ కాంగ్రెస్ కు కేంద్రం నోటీసులు

  • శనివారం వరకు గడువు ఇచ్చిన ప్రభుత్వం
  • అక్బర్ రోడ్ కార్యాలయానికి కాంగ్రెస్ గుడ్‌బై
  • ఐదు దశాబ్దాలుగా అక్కడే కొనసాగిన హెడ్డాఫీసు
  • గతేడాది కోట్లా మార్గ్ లో కొత్త ఆఫీసు తెరిచిన కాంగ్రెస్
దాదాపు ఐదు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి చిరునామాగా ఉన్న ఢిల్లీలోని అక్బర్ రోడ్ కార్యాలయంపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ శనివారం (మార్చి 28)లోగా ఆ భవనాన్ని ఖాళీ చేయాలని స్పష్టం చేసింది. 1978 నుంచి అంటే గత 48 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యకలాపాలకు 24, అక్బర్ రోడ్ భవనం కేంద్రంగా ఉంది. ఈ కార్యాలయంతో పాటు, 5 రైసినా రోడ్‌లో ఉన్న ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఆఫీస్‌ను కూడా ఖాళీ చేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఢిల్లీలోని కోట్లా మార్గ్‌లో ‘ఇందిరా భవన్’ పేరుతో కొత్త జాతీయ కార్యాలయాన్ని నిర్మించుకుంది. గత ఏడాదే సోనియా గాంధీ దీనిని ప్రారంభించారు. నిబంధనల ప్రకారం, రాజకీయ పార్టీకి సొంత భవనం సమకూరిన తర్వాత ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాల్సి ఉంటుంది. అయితే అక్బర్ రోడ్‌తో ఉన్న చారిత్రక అనుబంధం వల్ల పార్టీ కార్యకలాపాలు ఇంకా అక్కడి నుంచే కొనసాగుతున్నాయి.

తాజా ప్రభుత్వ నోటీసులపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యేనని ఆరోపిస్తోంది. భవనాన్ని బలవంతంగా ఖాళీ చేయించకుండా నిరోధించేందుకు, మరికొంత సమయం పొందేందుకు న్యాయపరమైన మార్గాలను అన్వేషిస్తోంది. ఈ విషయంలో కోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి.

Congress Party
Akbar Road Office
Delhi
Sonia Gandhi
eviction notice
Indian Youth Congress
Kotla Marg
Indira Bhavan
Central Government

More Telugu News