విజయవాడ గాయనిపై మోదీ ప్రశంస.. ప్రధాని పోస్ట్‌తో జాతీయ స్థాయిలో గుర్తింపు

  • విజయవాడ గాయని శ్రీలలిత పాడిన భక్తిగీతంపై ప్రధాని ప్రశంస
  • ‘కనకదుర్గా మహా ప్రమావిత’ పాట లింక్‌ను షేర్ చేసిన మోదీ
  • దుర్గాదేవి ఆరాధనతో మనసుకు శక్తి లభిస్తుందని ప్రధాని వ్యాఖ్య
  • విజయవాడకు ఇది గర్వకారణమన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ గాయని శ్రీలలిత ఆలపించిన ఓ భక్తి గీతానికి అరుదైన గౌరవం దక్కింది. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గాదేవిని స్తుతిస్తూ ఆమె పాడిన పాటను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. విజయవాడ గాయనికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడంపై సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది.

విజయవాడ సత్యనారాయణపురం ప్రాంతానికి చెందిన గాయని శ్రీలలిత దుర్గమ్మపై ‘కనకదుర్గా మహా ప్రమావిత’ అనే పాటను ఆలపించారు. ఈ పాట యూట్యూబ్ లింకును ప్రధాని మోదీ తాజాగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ "దుర్గాదేవిని ఆరాధించడం వల్ల మనసు అపారమైన శక్తిసామర్థ్యాలతో నిండిపోతుంది" అని పేర్కొన్నారు. ప్రధాని స్వయంగా ఒక తెలుగు భక్తిగీతాన్ని ప్రశంసించడంతో ఈ పాట ఒక్కసారిగా వైరల్ అయింది.

ఈ పరిణామంపై విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తమ నగరానికి చెందిన ఓ మహిళ పాడిన పాటను ప్రధాని గుర్తించి, ప్రజలతో పంచుకోవడం విజయవాడ వాసులందరికీ గర్వకారణమని సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు. స్థానిక ప్రతిభకు ప్రధాని నుంచి ప్రోత్సాహం లభించడం ఎంతో సంతోషకరమని అన్నారు.


Sreelalitha
Vijayawada
Singer
Narendra Modi
Kanakadurga Devi
Devotional Song
Viral Video
Andhra Pradesh
Indian Politics
Social Media

More Telugu News