గ్యాస్ రీఫిల్ బుకింగ్ గడువు పెంపు అంతా తూచ్‌.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం!

  • గ్యాస్ సిలిండర్ బుకింగ్ నిబంధనలు మార్చారంటూ విస్తృత ప్రచారం
  • ఈ వార్తలను పూర్తిగా ఖండించిన కేంద్ర పెట్రోలియం శాఖ
  • ప్రస్తుత నిబంధనల ప్రకారమే రీఫిల్ బుకింగ్ ఉంటుందని స్పష్టం
  • ఉదయం 35 రోజులుగా కనిపించిన గ్యాప్.. మధ్యాహ్నానికి సవరణ
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చమురు కంపెనీలు గ్యాస్ సరఫరా కోసం కొత్త నిబంధనలను తీసుకువస్తున్నాయంటూ సోష‌ల్ మీడియా, మీడియా సంస్థ‌ల్లో వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఆ వార్త‌ల సారాంశం ప్ర‌కారం రెండు సిలిండర్లు ఉన్న వారికి ఇకపై 35 రోజులకు ఒక గ్యాస్ సిలిండర్, ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కింద ఉన్న వినియోగదారులకు ప్రతి 45 రోజులకు ఒక సిలిండర్ అందుతుంది. అలాగే, పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు ఇదే నిబంధన వర్తిస్తుంది.

ఇక‌, డబుల్ సిలిండర్ వినియోగదారులకు రీఫిల్ బుకింగ్ గడువు 21 రోజులు ఉండగా, మార్చి రెండో వారంలో 25 రోజులకు పెంచిన చమురు సంస్థలు, తాజాగా 35 రోజులకు సవరించిన‌ట్లు వార్త‌లు వెలువ‌డ్డాయి. సింగిల్ సిలిండర్ ఉంటే పట్టణాల్లో 25 రోజుల తర్వాత, గ్రామాల్లో 45 రోజుల తర్వాత బుక్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. 

ఎల్‌పీజీ బుకింగ్ నిబంధనల్లో మార్పుల్లేవ్: వదంతులను ఖండించిన కేంద్రం
అయితే, ఈ వార్త‌ల‌పై తాజాగా కేంద్రం స్ప‌ష్ట‌త ఇచ్చింది. రీఫిల్ బుకింగ్ నిబంధనలు మార్చారన్న వార్తలను పూర్తిగా ఖండించింది. ప్రస్తుత నిబంధనలే కొనసాగుతాయని పెట్రోలియం శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారమే రీఫిల్ బుకింగ్ ప్రక్రియ కొనసాగుతుందని వివరించింది. పట్టణ ప్రాంతాల్లో 25 రోజుల తర్వాత, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల తర్వాత వినియోగదారులు మరో సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు. 

కాగా, ఈ రోజు ఉదయం గ్యాస్ బుక్ చేయడానికి ప్రయత్నించినప్పుడు హెచ్ పీ యాప్ లో 35 రోజుల గ్యాప్ చూపించింది. అయితే, కేంద్రం ప్రకటన తర్వాత మధ్యాహ్నానికి దాన్ని తిరిగి 25 రోజులకు మార్చడం గమనార్హం.
  

Gas Cylinder
Gas refill booking
Cooking gas
LPG cylinder
Oil companies
PM Ujjwala Yojana
West Asia tension

More Telugu News