సపోటాపండులో ఎలుకల మందు పెట్టి రెండేళ్ల కూతురును చంపిన తండ్రి

  • యాదాద్రి జిల్లా, సంస్థాన్ నారాయణపురంలో దారుణం
  • కుటుంబ కలహాలతో వేర్వేరుగా ఉంటున్నరవి, స్వాతి
  • తండ్రి వద్ద పెద్దకూతురు, తల్లివద్ద చిన్నకూతురు
  • పెద్దకూతురును కూడా తన వద్దకు పంపించాలని పోలీసులకు తల్లి ఫిర్యాదు
  • అంతలోనే సపోటా పండులో మందుపెట్టి చంపిన తండ్రి
తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి జిల్లాలో దారుణం జరిగింది. సంస్థాన్‌నారాయణపురం మండలం, లచ్చలగూడెంలో ఒక కసాయి తండ్రి సపోటా పండులో ఎలుకల మందుపెట్టి కన్నకూతురిని హతమార్చాడు. మూడు రోజులక్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వరికుప్పల రవికి మూడేళ్ల క్రితం స్వాతితో వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు రెండేళ్ల మేఘన, తొమ్మిది నెలల మయూరి ఉన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో స్వాతి తన చిన్నకూతురుతో కొద్దిరోజులుగా పుట్టింట్లో ఉంటోంది. పెద్ద కూతురు మేఘన తండ్రివద్ద ఉంటోంది.

మేఘనను కూడా తన వద్దకు పంపించాలని స్వాతి కొద్దిరోజులుగా కోరుతోంది. భర్త ఎంతకూ పంపించకపోవడంతో ఆమె మాడ్గులపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అక్కడి పోలీసులు నారాయణపురం పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రవిని పిలిపించి మాట్లాడారు. ఈ విషయం పెద్దమనుషుల మధ్య మాట్లాడుకోవాల్సి ఉంది.

కానీ తండ్రి రవి మాత్రం కుమార్తెను కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు. శనివారం సపోటా పండులో ఎలుకల మందుపెట్టి ఆమెకు తినమని చెప్పి ఇచ్చాడు. దీనితో కొద్దిసేపటికి వాంతులు చేసుకుని అపస్మారకస్థితిలోకి వెళ్లింది. ఆ తర్వాత భయంతో రవి కూడా నిద్రమాత్రలు, ఎలుకల మందు నీళ్లలో కలుపుకుని తాగగా, గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చిన్నారిని కూడా నీలోఫర్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. స్వాతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Varikuppala Ravi
Yadadri
daughter murder
supota fruit
rat poison
family disputes
Telangana crime

More Telugu News