ఇరాన్ యుద్ధ చట్టాలను ఉల్లంఘించింది.. విచారణను ఎదుర్కోవాల్సి వస్తుంది: హ్యూమన్ రైట్స్ వాచ్

  • హర్మూజ్ జలసంధి వద్ద నౌకలపై ఇరాన్ ఉద్దేశపూర్వకంగా దాడి చేసిందని వెల్లడి
  • ఇరాన్ అధికారులు కూడా ఈ విషయాన్ని ప్రకటించారన్న హ్యూమన్ రైట్స్ వాచ్
  • పౌరులు, వారి మౌలిక సదుపాయాలపై ప్రత్యక్ష దాడులు ఉల్లంఘన కిందకే వస్తుందని వెల్లడి
హర్మూజ్ జలసంధి, దాని పరిసర ప్రాంతాల్లో ప్రయాణించే నౌకలపై ఇరాన్ ఉద్దేశపూర్వకంగా దాడులు చేసిందని హ్యూమన్ రైట్స్ వాచ్ పేర్కొంది. తద్వారా ఇరాన్ యుద్ధ చట్టాలను ఉల్లంఘించిందని తెలిపింది. గత నెల 28న ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం ప్రారంభమైంది. ఆ తర్వాత హర్మూజ్ జలసంధి, సమీపంలోని నౌకలు లక్ష్యంగా ఇరాన్ దళాలు దాడులు చేశాయి.

ఈ దాడులు చేసింది తామేనని ఇరాన్ అధికారులు కూడా ప్రకటించిన విషయాన్ని హ్యూమన్ రైట్స్ వాచ్ గుర్తు చేసింది. వీటిని పౌర వాణిజ్య నౌకలుగా గుర్తించినట్లు వెల్లడించింది. యుద్ధంలో పౌరులు, వారి మౌలిక సదుపాయాలపై ప్రత్యక్ష దాడులు చేయడం అంతర్జాతీయ మానవతా హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఉల్లంఘనలకు పాల్పడిన వారు విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

అమెరికాకు చెందిన సేఫ్‌సీ విష్ణు, థాయ్‌లాండ్‌లోని షిప్పింగ్ కంపెనీకి చెందిన మయూరి నారీ అనే రెండు వాణిజ్య నౌకలపై ఇరాన్ దళాలు మార్చి 11వ తేదీన దాడి చేసిన విషయం తెలిసిందే. దాడులకు పాల్పడింది తామేనని ఇరాన్ అధికారులు ప్రకటించారు. ఇందుకు సంబంధించి వీడియోలు, ఫొటోలను కూడా పోస్టు చేశారు. ఈ విషయాలను గుర్తు చేసిన హ్యూమన్ రైట్స్ వాచ్, ఇరాన్ యుద్ధ చట్టాలను ఉల్లంఘించిందని ఆరోపించింది.

ఈ నెల 1 నుంచి 17వ తేదీ మధ్య కాలంలో హర్మూజ్ జలసంధి, పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లలో మొత్తం 16సార్లు దాడులు జరిగినట్లు తెలిపింది. దీనితో మొత్తం 17 వాణిజ్య నౌకలకు నష్టం వాటిల్లినట్లు తెలిపింది. ఈ ఘటనల్లో మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, పదిమంది గాయపడ్డారని, నలుగురు గల్లంతయ్యారని తెలిపింది. ఇరాన్ ఉద్దేశపూర్వకంగా ఈ దాడులు చేసిందని, కానీ ఇవి పౌర వాణిజ్య నౌకలుగా గుర్తించినట్లు తెలిపింది.

Human Rights Watch
Iran
Hormuz Strait
war crimes
maritime attacks
civilian ships
Persian Gulf

More Telugu News