ఆ 11 మంది జ్ఞాపకార్థం.. చిన్నస్వామి స్టేడియంలో ఎప్పటికీ ఖాళీగా 11 సీట్లు!

  • గతేడాది తొక్కిసలాట మృతులకు ఆర్సీబీ, కేఎస్‌సీఏ నివాళి
  • చిన్నస్వామి స్టేడియంలో 11 సీట్లు శాశ్వతంగా ఖాళీ
  • శనివారం మ్యాచ్‌కు ముందు స్మారక ఫలకం ఆవిష్కరణ
  • విషాదం తర్వాత చిన్నస్వామిలో ఆర్సీబీ ఆడనున్న తొలి మ్యాచ్ ఇదే
గతేడాది ఐపీఎల్ టైటిల్ గెలిచిన సంబరాల్లో జరిగిన ఘోర విషాదం తర్వాత డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తిరిగి తమ సొంతగడ్డపై బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో ఆ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 11 మంది అభిమానులకు గౌరవంగా నివాళులర్పించేందుకు ఆర్సీబీ ఫ్రాంచైజీ, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ)తో కలిసి కీలక నిర్ణయం తీసుకుంది.

శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగనున్న ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌కు ముందు, స్టేడియం ప్రవేశ ద్వారం వద్ద మృతుల జ్ఞాపకార్థం ఒక స్మారక ఫలకాన్ని ఆవిష్కరించనున్నారు. అంతేకాకుండా స్టేడియంలోని 11 సీట్లను శాశ్వతంగా వారి పేరు మీద రిజర్వ్ చేసి, ఎల్లప్పుడూ ఖాళీగా ఉంచుతారు. భవిష్యత్తులో ఇక్కడ జరిగే అంతర్జాతీయ మ్యాచ్‌లు సహా అన్ని ఈవెంట్లలో ఈ సీట్లు ఖాళీగానే ఉంటాయని అధికారులు తెలిపారు.

గతేడాది జూన్ 4న ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల భారీ తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. సుమారు 3 లక్షల మంది అభిమానులు ఒక్కసారిగా గుమిగూడటంతో జరిగిన ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయపడ్డారు.

సరైన అనుమతులు తీసుకోకుండా వేడుకలు నిర్వహించి, అలజడికి కారణమయ్యారని కర్ణాటక ప్రభుత్వం అప్పట్లో ఆర్సీబీ, కేఎస్‌సీఏలను బాధ్యుల్ని చేసింది. అనంతరం మృతుల కుటుంబాలకు ఆర్సీబీ ఫ్రాంచైజీ ఒక్కొక్కరికి రూ. 25 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించింది. ఈ విషాదం తర్వాత చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇప్పుడు ప్రభుత్వ అనుమతితో ఈ సీజన్‌లో ఐదు మ్యాచ్‌లను ఇక్కడ ఆడనుంది. మిగిలిన రెండు హోమ్ మ్యాచ్‌లను రాయ్‌పూర్‌లో నిర్వహించనున్నట్లు ఫ్రాంచైజీ ఇదివరకే వెల్లడించింది.

Chinnaswamy Stadium
Royal Challengers Bangalore
RCB
IPL 2026
Sunrisers Hyderabad
Karnataka State Cricket Association
Fan deaths
Memorial
Tribute
Crowd surge

More Telugu News