మొయినాబాద్ డ్రగ్స్ కేసు: నిందితులు కస్టడీకి.. గ్యాంగ్‌స్టర్ కోణంలో సిట్ దర్యాప్తు

  • మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ముగ్గురు ప్రధాన నిందితులు పోలీసు కస్టడీకి
  • నిందితుడు నమిత్ శర్మకు గ్యాంగ్‌స్టర్లతో సంబంధాలపై సిట్ ఆరా
  • గతంలో జరిగిన 24 డ్రగ్స్ పార్టీలపై పోలీసుల దృష్టి
  • ఏపీ ఎంపీ, ప్రియాంకరెడ్డి పాత్రపై విచారణలో స్పష్టత వచ్చే అవకాశం
  • నిందితుల అంతర్జాతీయ కాల్ డేటాను విశ్లేషిస్తున్న పోలీసులు
సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్, కాల్పుల కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ముగ్గురిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒకడైన నమిత్ శర్మకు గ్యాంగ్‌స్టర్లతో సంబంధాలు ఉన్నాయనే కోణంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణను ముమ్మరం చేసింది.

ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రోహిత్ రెడ్డి, రితీశ్ రెడ్డి, నమిత్ శర్మలను మూడు రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ సోమవారం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు నేతృత్వంలోని సిట్, పక్కా ప్రశ్నావళితో విచారణకు సిద్ధమైంది. అవసరమైతే నిందితులను ముఖాముఖిగా విచారించి వాస్తవాలు రాబట్టాలని భావిస్తున్నారు. నేడు (మంగళవారం) నిందితులను ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంది.

ఈ కేసులో డ్రగ్స్ సరఫరాదారుడిగా ఉన్న అభిషేక్ సింగ్ ఇచ్చిన వాంగ్మూలం సంచలనం రేపుతోంది. గతంలో రోహిత్ రెడ్డి నిర్వహించిన 24 పార్టీలకు తానే డ్రగ్స్ సరఫరా చేసినట్లు అంగీకరించాడు. దీంతో ఆ పార్టీలకు ఎవరెవరు హాజరయ్యారనేది తేల్చేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ విచారణలో మరికొంతమంది ప్రముఖుల పేర్లు బయటపడొచ్చని భావిస్తున్నారు.

మరోవైపు, కాల్పులకు పాల్పడిన ఢిల్లీ వాసి నమిత్ శర్మ నేపథ్యంపై పోలీసులు దృష్టి సారించారు. పంజాబ్ పోలీసుల మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న గ్యాంగ్‌స్టర్, నమిత్ శర్మ ఒక్కరేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతడికి దుబాయ్ మాఫియాతో ఉన్న సంబంధాలపై ఆరా తీసేందుకు ప్రత్యేక బృందాలు పంజాబ్, ఢిల్లీలకు వెళ్లాయి.

అదే సమయంలో, పార్టీలో ఉన్న ఏపీకి చెందిన ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్, ప్రియాంకరెడ్డి అనే మహిళ పాత్రపైనా ఉత్కంఠ కొనసాగుతోంది. నిందితుల కస్టడీ విచారణలో వీరి ప్రమేయంపై స్పష్టత రానుంది. తాజాగా నిందితుల అంతర్జాతీయ కాల్ డేటాను (ISD) కూడా పోలీసులు విశ్లేషిస్తున్నట్లు సమాచారం. దుబాయ్ నుంచి వచ్చిన కొన్ని ఎన్‌క్రిప్టెడ్ సందేశాలు ఈ కేసులో కీలకంగా మారే అవకాశం ఉంది.

Namit Sharma
Moinabad drugs case
Hyderabad drug bust
Gangster connection
Telangana SIT investigation
Rohit Reddy
Drugs supply
Abhishek Singh
Eluru MP Putta Mahesh
Dubai mafia

More Telugu News