భద్రతకు గ్యారెంటీ లేదు.. పీఎస్ఎల్ ఆడొద్దంటూ స్మిత్, వార్నర్‌లకు ఉగ్రవాదుల వార్నింగ్!

  • పాకిస్థాన్ సూపర్ లీగ్‌ 2026 సీజన్‌కు ఉగ్రవాదుల ముప్పు
  • డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ వంటి ఆటగాళ్లు రావొద్దంటూ హెచ్చరిక
  • టోర్నీని జరగనివ్వమంటూ సాయుధ మిలిటెంట్ గ్రూప్ అల్టిమేటం
  • రెండు నగరాలకే టోర్నీ పరిమితం.. ప్రేక్షకులు లేకుండా నిర్వహణ
  • ప్రభుత్వ ఆదేశాల మేరకే ఈ మార్పులన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు
పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2026 సీజన్ భవిష్యత్తు ప్రమాదంలో పడింది. టోర్నీలో పాల్గొనేందుకు వస్తున్న విదేశీ ఆటగాళ్లకు ఓ సాయుధ గ్రూప్ నుంచి తీవ్రమైన హెచ్చరికలు జారీ కావడంతో తీవ్ర అనిశ్చితి నెలకొంది. పాకిస్థాన్‌కు చెందిన జమాత్-ఉల్-అహ్రర్ అనే మిలిటెంట్ సంస్థ, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, డారిల్ మిచెల్ వంటి అంతర్జాతీయ స్టార్లకు బహిరంగ హెచ్చరిక జారీ చేసింది. పాకిస్థాన్‌లో పర్యటిస్తే ఆటగాళ్ల భద్రతకు తాము గ్యారెంటీ ఇవ్వలేమని స్పష్టం చేసింది.

ఈ హెచ్చరికపై ఆ సంస్థ కమాండర్ ఒకరు 'ది సండే గార్డియన్' తో మాట్లాడుతూ మరిన్ని వివరాలు వెల్లడించారు. "తమ ఆటగాళ్లను పాకిస్థాన్‌కు పంపవద్దని సంబంధిత క్రికెట్ బోర్డులకు మేం సలహా ఇస్తున్నాం. ఒకవేళ హెచ్చరికను పట్టించుకోకుండా వస్తే, వారికి ఏదైనా జరిగినప్పుడు దానికి మా బాధ్యత ఉండదు" అని ఆయన పేర్కొన్నారు. 

తమకు క్రికెట్‌తో వ్యతిరేకత లేదని, కానీ ప్రస్తుత పాకిస్థాన్ భద్రతా పరిస్థితులు అంతర్జాతీయ టోర్నీ నిర్వహణకు అనుకూలంగా లేవని తెలిపారు. "హెచ్చరికలను కాద‌ని ఆటగాళ్లు వస్తే, మ్యాచ్‌లు జరగకుండా ఉండేందుకు మా శక్తి మేరకు ప్రయత్నిస్తాం. టోర్నీకి అంతరాయం కలిగించి, ఆటగాళ్లు మైదానంలోకి అడుగుపెట్టకుండా చూస్తాం" అని ఆ కమాండర్ హెచ్చరించారు.

ఈ బెదిరింపుల నేపథ్యంలోనే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పీఎస్ఎల్ షెడ్యూల్‌లో కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. టోర్నీని కేవలం రెండు నగరాలకు పరిమితం చేసి, ప్రేక్షకులు లేకుండానే (బిహైండ్ క్లోజ్డ్ డోర్స్) నిర్వహించాలని నిర్ణయించింది. అయితే, పీసీబీ చీఫ్ మోహసిన్ నఖ్వీ మాత్రం ఈ మార్పులకు వేరే కారణాలు చెబుతున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, దేశంలో పెరిగిన ఇంధన ధరల కారణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు.

ఈ ఏడాది పీఎస్ఎల్‌లో ఆస్ట్రేలియాకు చెందిన ఆడమ్ జంపా, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ, న్యూజిలాండ్ ప్లేయర్ డెవాన్ కాన్వే వంటి ప్రముఖులు కూడా పాల్గొంటున్నారు. ఈ నెల‌ 26 నుంచి టోర్నీ షురూ కానున్న నేపథ్యంలో ఈ సంక్షోభాన్ని పీసీబీ, విదేశీ ఆటగాళ్లు ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది.

PSL 2026
David Warner
Pakistan Super League
Steve Smith
security threat
terrorist warning
cricket
PCB
Pakistan
Jammat-ul-Ahrar

More Telugu News