తెదేపా కార్యకర్తల కోసం లోకేశ్ ప్రత్యేక చొరవ.. రాష్ట్రంలోనే తొలిసారిగా హెల్త్ క్యాంప్

  • 530 మందికి ఉచిత పరీక్షలు, మందుల పంపిణీ
  • పార్టీ గుర్తింపు కార్డులతో ఆరోగ్య సమాచారం అనుసంధానం
  • ప్రతి మూడు నెలలకు ఒకసారి శిబిరం నిర్వహిస్తామని వెల్లడి
ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. మంత్రి నారా లోకేశ్‌ ఆదేశాలతో ఆదివారం మంగళగిరిలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పట్టణంలోని ఈద్గా మైదానంలో ఆస్టర్‌ రమేష్‌ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ శిబిరానికి తెదేపా కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దాదాపు 530 మందికి ప్రత్యేక వైద్య బృందం వివిధ రకాల పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేసింది. పార్టీ కార్యకర్తల ఆరోగ్యంపై మంత్రి లోకేశ్‌ ప్రత్యేక శ్రద్ధ చూపడం అభినందనీయమని డాక్టర్ కార్తిక్‌ చౌదరి అన్నారు. కార్యకర్తల ఆరోగ్య సమాచారాన్ని వారి పార్టీ గుర్తింపు కార్డుతో అనుసంధానించడం ఒక కీలకమైన ముందడుగు అని తెలిపారు. దీనివల్ల అత్యవసర పరిస్థితుల్లో వారికి ఎలాంటి వైద్యం అందించాలనే దానిపై స్పష్టత వస్తుందని వివరించారు.

ఇలాంటి వైద్య శిబిరాలను ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహిస్తామని వైద్య బృందం వెల్లడించింది. ఈ శిబిరంలో గుండె వైద్య నిపుణులు పెద్ది నవీన్‌ కృష్ణ, న్యూరాలజిస్ట్‌ మీనా, ఆర్థోపెడిక్‌ వైద్యులు భరత్‌ చంద్ర, చైతన్య, వసంతి, రావెల నీరెన్‌ తదితరులు వైద్య సేవలు అందించారు.
 

Nara Lokesh
TDP
Telugu Desam Party
Andhra Pradesh
Health Camp
Medical Camp
Mangalagiri
Aster Ramesh Hospital
Party Workers

More Telugu News