ఇరాన్ ప్రతీకార దాడితో వణికిన ఇజ్రాయెల్‌ నగరాలు.. వీడియో ఇదిగో!

  • శనివారం రాత్రి క్షిపణులతో ఇజ్రాయెల్ పై విరుచుకుపడ్డ ఇరాన్
  • డిమోన్ అణు కేంద్రం సమీపంలోనే దాడులు జరగడంతో ఉద్రిక్తత
  • 100 మందికి పైగా పౌరులకు గాయాలు, భారీ ఆస్తి నష్టం
  • పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. తమ అణు కేంద్రంపై దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై శనివారం రాత్రి ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంలోని డిమోనా, అరద్ నగరాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ముఖ్యంగా, ఇజ్రాయెల్ ప్రధాన అణు పరిశోధన కేంద్రానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే క్షిపణులు పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

ఆకాశం నుంచి నిప్పుల వర్షంలా దూసుకొచ్చిన క్షిపణులు జనావాసాలపై పడటంతో తీవ్ర విధ్వంసం జరిగింది. పేలుళ్ల ధాటికి పలు భవనాలు ధ్వంసమయ్యాయి. ఇళ్ల తలుపులు, కిటికీలు ఊడిపడ్డాయి. ఇళ్లలోని సామాగ్రి చెల్లాచెదురుగా పడిపోయింది. ప్రాణభయంతో జనం పరుగులు తీయగా, ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇరాన్ దాడిలో పెద్ద సంఖ్యలో పౌరులు గాయపడ్డారు. అరద్ నగరంలో 84 మంది, డిమోనాలో 33 మంది గాయపడినట్లు ప్రాథమిక సమాచారం. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిలో ష్రాప్నెల్ (క్షిపణి శకలాలు) తగిలి తీవ్రంగా గాయపడిన 10 ఏళ్ల బాలుడు, 40 ఏళ్ల మహిళ కూడా ఉన్నారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. తమ దేశంలోని నతాంజ్ అణు కేంద్రంపై దాడికి ప్రతీకారంగానే ఈ చర్యకు పాల్పడినట్లు ఇరాన్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Israel
Iran attack
Israel Iran conflict
Dimona
Arad
Nuclear facility
Middle East tensions
Missile attack
Iran retaliation
War

More Telugu News