ప్రయాణికులకు అలర్ట్.. పశ్చిమాసియా విమానాలపై ఇండిగో, ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

  • ఇవాళ‌ పరిమితంగా విమానాలు నడుపుతున్నట్లు ప్రకటించిన ఇండిగో, ఎయిర్ ఇండియా
  • సుమారు 50 విమానాలు నడపనున్న ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్
  • జెడ్డా, మస్కట్ వంటి నగరాలకు కొనసాగనున్న రెగ్యులర్ సర్వీసులు
  • యూఏఈ, సౌదీ అరేబియాకు 30 ప్రత్యేక విమానాలు నడిపేందుకు ఏర్పాట్లు
  • ప్రయాణికులు ఫ్లైట్ స్టేటస్ చెక్ చేసుకోవాలని విమానయాన సంస్థల సూచన
పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్)లో వేగంగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో భారత విమానయాన సంస్థలు ఈరోజు (మార్చి 22న) పరిమిత సంఖ్యలో విమాన సర్వీసులను కొనసాగిస్తున్నట్లు ప్రకటించాయి. చివరి నిమిషంలో మార్పులు జరిగే అవకాశం ఉన్నందున, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, బయలుదేరే ముందు తమ విమాన స్థితిని (ఫ్లైట్ స్టేటస్) తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని సూచించాయి.

ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో, ప్రస్తుత భద్రతా పరిస్థితులు, నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి ఇవాళ‌ ఎంపిక చేసిన కొన్ని విమానాలను నడుపుతున్నట్లు తెలిపింది. "పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల్లో ప్రయాణికులకు సహాయం చేయడానికి, వారిని తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చడానికి మా బృందాలు రాత్రింబవళ్లు పనిచేస్తున్నాయి" అని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతే తమకు అత్యంత ముఖ్యమని, ప్రతి నిర్ణయం వారి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకునే తీసుకుంటామని ఇండిగో స్పష్టం చేసింది.

మరోవైపు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశాయి. ఈరోజు పశ్చిమాసియాలోని వివిధ ప్రాంతాలకు, అక్కడి నుంచి భారత్‌కు షెడ్యూల్డ్, నాన్-షెడ్యూల్డ్ (ప్రత్యేక) విమానాలు కలిపి మొత్తం 50 సర్వీసులను నడపనున్నట్లు తెలిపాయి. జెడ్డా, మస్కట్ వంటి కీలక నగరాలకు తమ రెగ్యులర్ సర్వీసులు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నాయి.

భారత్, జెడ్డా మధ్య మొత్తం 20 విమాన సర్వీసులు నడవనున్నాయి. ఎయిర్ ఇండియా ఢిల్లీ, ముంబైల నుంచి రిటర్న్ ఫ్లైట్స్ నడుపుతుండగా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ బెంగళూరు, మంగళూరు, కోజికోడ్ నుంచి సర్వీసులు ఆపరేట్ చేస్తుంది. అలాగే ఢిల్లీ, కొచ్చి, ముంబై, కన్నూర్ వంటి భారత నగరాల నుంచి మస్కట్‌కు ఎనిమిది షెడ్యూల్డ్ విమానాలను నడపనుంది.

ఈ రెగ్యులర్ సర్వీసులతో పాటు యూఏఈ, సౌదీ అరేబియాలోని గమ్యస్థానాలకు సుమారు 30 ప్రత్యేక విమానాలను నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది. అయితే, ఈ ప్రత్యేక విమానాలు ఆయా విమానాశ్రయాల్లో స్లాట్ లభ్యత, అక్కడి పరిస్థితులపై ఆధారపడి ఉంటాయని తెలిపింది. భారత, స్థానిక అధికారుల నుంచి అవసరమైన అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే ఈ విమానాలను నడుపుతున్నట్లు స్పష్టం చేసింది.

Middle East Flights
IndiGo
IndiGo flights
Air India
Air India flights
West Asia flights
flight status
Jeddah
Muscat
flight cancellations

More Telugu News