ఇరాన్‌పై జీ7 దేశాల కన్నెర్ర.. అణ్వాయుధాలు సమకూర్చుకోవద్దని వార్నింగ్

  • పశ్చిమాసియాలో ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీ7 దేశాలు
  • పౌరులు, మౌలిక వసతులపై దాడులు వెంటనే ఆపాలని డిమాండ్
  • ఇరాన్ చర్యలు ప్రపంచ భద్రతకు ముప్పు అని హెచ్చరిక
  • అణ్వాయుధాలు పొందవద్దని, క్షిపణి కార్యక్రమాన్ని నిలిపివేయాలని సూచన
మధ్యప్రాచ్యంలోని పలు దేశాల్లో పౌరులు, కీలక మౌలిక సదుపాయాలపై ఇరాన్ చేస్తున్న దాడులను జీ7 దేశాల కూటమి తీవ్రంగా ఖండించింది. ఇరాన్, దాని అనుబంధ వర్గాలు చేస్తున్న ఈ అన్యాయమైన దాడులను ఎదుర్కొంటున్న ప్రాంతీయ భాగస్వామ్య దేశాలకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, అమెరికా దేశాల విదేశాంగ మంత్రులతో పాటు యూరోపియన్ యూనియన్ ఉన్నత ప్రతినిధి సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, జోర్డాన్, ఇరాక్‌లలో పౌరులు, ఇంధన మౌలిక వసతులపై ఇరాన్ ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యపూరిత దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని జీ7 కూటమి స్పష్టం చేసింది. ఇరాన్ చర్యలు కేవలం లక్షిత దేశాలకే కాకుండా, ప్రాంతీయ, ప్రపంచ భద్రతకు కూడా పెను ముప్పుగా పరిణమిస్తున్నాయని హెచ్చరించింది. ఇలాంటి దాడులన్నింటినీ తక్షణమే, బేషరతుగా నిలిపివేయాలని డిమాండ్ చేసింది.

హర్మూజ్ జలసంధి వంటి కీలక సముద్ర మార్గాల భద్రత, ప్రపంచ సరఫరా వ్యవస్థల పరిరక్షణ చాలా ముఖ్యమని జీ7 దేశాలు నొక్కి చెప్పాయి. ఇరాన్ లేదా దాని అనుబంధ వర్గాల దాడులను ఎదుర్కొంటున్న దేశాలకు తమ భూభాగాలను, పౌరులను రక్షించుకునే హక్కు ఉందని, వారి భద్రత, సార్వభౌమత్వానికి తమ మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చాయి.

ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని పొందకూడదని పునరుద్ఘాటించిన జీ7 కూటమి.. తన బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాన్ని, ప్రాంతంలో అస్థిరత సృష్టించే కార్యకలాపాలను తక్షణం నిలిపివేయాలని పిలుపునిచ్చింది.

Iran
G7
nuclear weapons
Middle East
attacks
regional security
ballistic missile program
Hormuz Strait

More Telugu News