కోతుల బెడదకు పరాకాష్ట.. కాకినాడ జిల్లా పెద్దిపాలెంలో మహిళ ప్రాణాలు తీసిన వానరాలు

  • గేదెకు నీళ్లు పెట్టేందుకు వెళ్లగా జరిగిన ఘటన
  • సుమారు 20 కోతులు ఒక్కసారిగా దాడి 
  • గ్రామంలో కోతుల బెడద తీవ్రంగా ఉందని స్థానికుల ఆవేదన
కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కోతుల గుంపు దాడి చేయడంతో ఓ వృద్ధురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో నిన్న ఈ దారుణ ఘటన జరిగింది.

వివరాల్లోకి వెళితే.. పెద్దిపాలెం గ్రామ శివారులో దానబోయిన చిన్నబుల్లి (68) తన జీడిమామిడి తోటలో తన కుమార్తె కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. ఆమె తోటలోని గేదెకు నీళ్లు పెట్టేందుకు వెళ్లారు. అదే సమయంలో, అక్కడ ఉన్న సుమారు 20 కోతుల గుంపు ఒక్కసారిగా ఆమెపై దాడికి దిగింది. కోతులు విచక్షణారహితంగా కరుస్తూ తీవ్రంగా గాయపరిచాయి. కోతుల దాడి నుంచి తప్పించుకోలేక, తీవ్ర రక్తస్రావంతో చిన్నబుల్లి సంఘటనా స్థలంలోనే కుప్పకూలి మరణించారు.

ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ ప్రాంతంలో కోతుల బెడద చాలా ఎక్కువగా ఉందని, గతంలో కూడా చాలామందిపై దాడులు చేశాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, కోతుల దాడిలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటిసారని వారు వాపోయారు. ఈ ఘటనతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
 

Monkey attack
Chinnabulli
Kakinada
Andhra Pradesh
Old woman death
Prathipadu
Peddapalem
Monkey menace
East Godavari district

More Telugu News