ట్విట్టర్ డీల్ వివాదం... ఎలాన్ మస్క్‌కు కోర్టులో ఎదురుదెబ్బ

  • ట్విట్టర్ కొనుగోలు కేసులో ఎలాన్ మస్క్‌ను తప్పుబట్టిన కోర్టు 
  • పెట్టుబడిదారులను ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించారని ఫెడరల్ జ్యూరీ ఏకగ్రీవ తీర్పు
  • 2022లో ట్వీట్లతో షేర్ల ధరలను ప్రభావితం చేశారని నిర్ధారణ
  • నష్టపోయిన ఇన్వెస్టర్లకు భారీగా నష్టపరిహారం లభించే అవకాశం
టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు అమెరికా కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ (ప్రస్తుతం ఎక్స్) కొనుగోలు సమయంలో తన ట్వీట్ల ద్వారా పెట్టుబడిదారులను ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించారని శాన్ ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టు జ్యూరీ ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది.

2022లో ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసే ప్రక్రియలో, ఆ ప్లాట్‌ఫామ్‌లో నకిలీ ఖాతాలు (బాట్లు) ఎక్కువగా ఉన్నాయంటూ మస్క్ వరుస ట్వీట్లు చేశారు. కొనుగోలు ఒప్పందాన్ని 'హోల్డ్'లో పెడుతున్నట్లు, ఆపై డీల్ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. ఈ వ్యాఖ్యల కారణంగా ట్విట్టర్ షేర్ల విలువ గణనీయంగా పడిపోయింది.

మస్క్ డీల్ నుంచి తప్పుకుంటారని భావించిన చాలా మంది ఇన్వెస్టర్లు, తమ షేర్లను భారీ నష్టాలకు అమ్ముకున్నారు. అయితే, ట్విట్టర్ న్యాయపోరాటం చేయడంతో మస్క్ వెనక్కి తగ్గి, అక్టోబర్ 2022లో ముందుగా ఒప్పందం చేసుకున్న ధరకే (షేరుకు 54.20 డాలర్లు) కంపెనీని కొనుగోలు చేశారు. దీంతో, ముందుగానే షేర్లు అమ్మేసిన వారు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో బాధితులు కోర్టును ఆశ్రయించారు.

రెండు రోజుల పాటు జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం, తొమ్మిది మంది సభ్యుల జ్యూరీ ఈ ఏకగ్రీవ తీర్పును వెలువరించింది. విచారణ సమయంలో మస్క్ తన ట్వీట్లు మూర్ఖత్వంతో కూడినవి అయ్యుండొచ్చని అంగీకరించినప్పటికీ, ఇన్వెస్టర్లను మోసం చేయాలనే ఉద్దేశం తనకు లేదని వాదించారు. అయితే, జ్యూరీ ఈ వాదనను తోసిపుచ్చింది. ఈ తీర్పుతో నష్టపోయిన ఇన్వెస్టర్లకు వేలాది డాలర్ల నష్టపరిహారం లభించే అవకాశం ఉంది.


Elon Musk
Twitter deal
Tesla
Twitter X
investment fraud
share price
San Francisco Federal Court
social media platform
court verdict

More Telugu News