ఆధునిక యుద్ధాలు ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తున్నాయి: రాజ్‌నాథ్ సింగ్

  • యుద్ధం అంటే సరిహద్దుల్లో జరిగే ఘర్షణ మాత్రమే కాదన్న రాజ్‌నాథ్
  • సరిహద్దులను దాటి ఆర్థిక, డిజిటల్, ఇంధన భద్రతలపై ప్రభావం పడుతోందని వ్యాఖ్య
  • ప్రతి పౌరుడు, యువత దేశ రక్షణకు సిద్ధమై ఉండాలని పిలుపు
ఆధునిక యుద్ధాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను, సైబర్ స్పేస్‌ను దెబ్బతీస్తున్నాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. నేటి రోజుల్లో యుద్ధం అంటే కేవలం సరిహద్దుల్లో జరిగే ఘర్షణ మాత్రమే కాదని అన్నారు. యుద్ధం సరిహద్దులను దాటి ఆర్థిక, డిజిటల్, ఇంధన, ఆహార భద్రతలో భాగమయ్యాయని పేర్కొన్నారు. వాటి ద్వారా ఒక దేశం మరో దేశాన్ని బలహీనపరిచే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి దేశపౌరుడు అన్ని సమయాల్లో దేశ రక్షణకు సిద్ధమై ఉండాలని కేంద్రమంత్రి పిలుపునిచ్చారు. ఆధునిక యుద్ధాలకు అనుగుణంగా దేశంలో ఆయుధ సంపత్తిని అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా సాయుధ దళాలకు ఆధునాతన, స్వదేశీ ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. దేశ రక్షణలో యువత తనవంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

ఉత్తరాఖండ్‌లోని సైనిక పాఠశాల ఆవిర్భావ దినోత్సవంలో వర్చువల్‌గా పాల్గొన్న రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, యువత దేశం కోసం ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోగలిగేలా క్రమశిక్షణ, మానసిక స్థైర్యం పెంపొందించుకోవాలని సూచించారు. సైన్యం, పౌరులు బలంగా ఉంటేనే దేశం ముందుకు సాగుతుందని అన్నారు. దేశ రక్షణలో యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఎన్‌సీసీలో ప్రవేశాల సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు.

గతంలో 17 లక్షలుగా ఉన్న నియామకాలను 20 లక్షలకు పెంచుతున్నట్లు వెల్లడించారు. పీపీపీ నమూనాలో దేశవ్యాప్తంగా 100 కొత్త సైనిక పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సైనిక పాఠశాలల్లో బాలికలు ఎక్కువ సంఖ్యలో చేరుతున్నారని, ఇది చారిత్రాత్మక ముందడుగు అన్నారు. ఇది దేశ 'నారీ శక్తి'ని మరింత బలోపేతం చేస్తోందని అన్నారు.

Rajnath Singh
Modern warfare
Economic impact
Cyber security
Defense minister
Military schools

More Telugu News