ఇరాన్‌పై యుద్ధానికి అమెరికా భారత్ సాయం కోరినట్లు వార్తలు.. స్పందించిన కేంద్రం

  • భారత్‌లోని మిలటరీ స్థావరాలను వినియోగించుకుంటామని అమెరికా అడిగినట్లు ప్రచారం
  • నిరాధారమైన వార్తలంటూ కొట్టిపారేసిన కేంద్ర ప్రభుత్వం
  • ఇలాంటి అసత్య ప్రచారాలను విశ్వసించవద్దని విజ్ఞప్తి
ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో అమెరికా భారత్ సహాయం కోరిందని సామాజిక మాధ్యమాల వేదికగా జరుగుతోన్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఇవి పూర్తిగా నిరాధారమైన వార్తలంటూ కొట్టిపారేసింది. పశ్చిమాసియాలో 22 రోజుల క్రితం ప్రారంభమైన యుద్ధం రోజురోజుకూ తీవ్రమవుతోంది.

ఈ నేపథ్యంలో పశ్చిమ భారత్ నుంచి ఇరాన్‌పై దాడులు చేయడానికి వీలుగా మిలటరీ స్థావరాలను వినియోగించుకుంటామని అమెరికా అడిగినట్లు ప్రచారం జరిగింది. ఇందుకు సంబంధించి ఇంగ్లీష్ మీడియాలో కథనాలు రావడంతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించింది. ఇలాంటి అసత్య ప్రచారాలను విశ్వసించవద్దని కోరింది. నిరాధారమైన, కల్పిత విషయాలపై జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించింది. ఈ మేరకు 'ఎక్స్' వేదికగా పోస్టు చేసింది. 

ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో భారత్‌పై కొన్ని అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నెల ప్రారంభంలో శ్రీలంకకు సమీపంలో ఇరాన్‌కు చెందిన ఐరిస్ దేనా యుద్ధనౌకను అమెరికా జలాంతర్గామి ముంచివేసింది. ఆ సమయంలో భారత పోర్టులను అమెరికా ఉపయోగించుకుంటోందనే ప్రచారం జరగగా, ప్రభుత్వం ఖండించింది.

ఇటీవల శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిసనాయక ఆ దేశ పార్లమెంటులో మాట్లాడుతూ, రెండు యుద్ధ విమానాల కోసం అమెరికా తమ పోర్టులను ఉపయోగించుకుంటామని చెబితే తిరస్కరించామని వెల్లడించారు. తాము యుద్ధంలో తటస్థంగా ఉంటున్నామని, అందుకే తమ పోర్టులను ఉపయోగించుకోవడానికి అంగీకరించలేదని తెలిపారు. శ్రీలంక అధ్యక్షుడి ప్రకటన అనంతరం భారత్ సహాయం కూడా అమెరికా కోరినట్లు ప్రచారం జరగడం గమనార్హం.

India
Iran
America
US India relations
West Asia conflict
Military bases
Foreign affairs ministry

More Telugu News