పీఎస్‌యూ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62కి పెంపు.. సానుకూలంగా ప్రభుత్వం!

  • ప్రతిపాదనకు కేబినెట్ సబ్ కమిటీ సూత్రప్రాయ అంగీకారం
  • రాష్ట్రవ్యాప్తంగా 8,500 మందికి లబ్ధి చేకూరే అవకాశం
  • త్వరలో ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్
ఏపీలోని ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూ), గురుకుల సొసైటీ పాఠశాలల ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. వీరి పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచే ప్రతిపాదనకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఈ అంశంపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌, పురపాలక శాఖ మంత్రి నారాయణలతో కూడిన కమిటీ ఇప్పటికే సమావేశమైంది. పదవీ విరమణ వయసు పెంపునకు ఈ కమిటీ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది. ఈ నిర్ణయం అమలైతే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8,500 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.

ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, 9, 10 షెడ్యూల్ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు డిమాండ్ చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రతిపాదనలు ముందుకు సాగలేదు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ అంశంపై దృష్టి సారించి, మంత్రులతో సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. వయసు పెంపు వల్ల ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం వంటి అంశాలను కూడా కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి, ఒక సమగ్ర నివేదికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

AP PSU Employees
AP government
Retirement age hike
Payyavula Keshav
Nara Lokesh
Narayana
Gurukul society schools
Andhra Pradesh
Government jobs
Pension age

More Telugu News