'జీవామృతం' మేకింగ్ వీడియో పంచుకున్న విజయసాయిరెడ్డి

Vijayasai Reddy Shares Jeevamrutham Making Video
  • వైసీపీకి రాజీనామా తర్వాత వ్యవసాయంపై దృష్టి సారించిన విజయసాయిరెడ్డి
  • సేంద్రియ సాగులో వాడే జీవామృతం తయారీని వివరిస్తూ వీడియో పోస్ట్
  • తొండుపల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో సాగు పనులతో బిజీ
  • ఒకప్పుడు వైసీపీలో నంబర్ 2గా ఉన్న సాయిరెడ్డి ప్రస్తుతం రాజకీయాలకు దూరం
  • సోషల్ మీడియా ద్వారా తన వ్యవసాయ అనుభవాలను పంచుకుంటున్న వైనం
వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్న సీనియర్ నేత విజయసాయిరెడ్డి ఇప్పుడు కొత్త అవతారంలో కనిపిస్తున్నారు. పూర్తి సమయాన్ని వ్యవసాయానికే కేటాయిస్తూ, పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. తాజాగా ఆయన హైదరాబాద్ శివార్లలోని తొండుపల్లి వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ ఎరువైన 'జీవామృతం' తయారుచేస్తున్న వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో పంచుకున్నారు.

ఈ వీడియోలో జీవామృతం తయారీ విధానాన్ని ఆయన స్వయంగా వివరించారు. “సేంద్రియ వ్యవసాయంలో భూమిలో మిత్ర పురుగులు, ఎర్రలు, వానపాములు, సూక్ష్మజీవులు భూసారం పెంచి పోషకాలతో అధిక దిగుబడి కోసం 'జీవామృతం' వాడతాం. ఆవు పేడ, ఆవు మూత్రం, తాటిబెల్లం, సెనగ కందుల పిండి, పుట్టమట్టిని సమపాళ్లలో కలిపిన మిశ్రమాన్ని కర్రతో సవ్యదిశలో రోజుకు రెండు సార్లు చొప్పున మూడు రోజులు తిప్పి జీవామృతం తయారుచేస్తాం. దీన్ని తొండుపల్లి వ్యవసాయక్షేత్రంలో చెట్లకు పోస్తాం” అని విజయసాయిరెడ్డి తెలిపారు.

2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత పార్టీకి, పదవికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి, అప్పటి నుంచి రాజకీయ కార్యకలాపాలకు పూర్తిగా దూరమయ్యారు. ఒకప్పుడు పార్టీ అధినేత జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా, పార్టీలో నంబర్ 2గా చక్రం తిప్పిన ఆయన, ఇప్పుడు తన వ్యవసాయ క్షేత్రంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. సోషల్ మీడియాలో మాత్రం చురుగ్గా ఉంటూ తన వ్యవసాయ అనుభవాలను, అభిప్రాయాలను పంచుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.
Go Back to Shorts
Vijayasai Reddy
Jeevamrutham
Organic Farming
Tondapalli Farm
YSRCP
Agriculture
Soil Fertility
Natural Fertilizer
Telugu News
Hyderabad

More Telugu News