తండ్రి కోసం కొడుకు విజ్ఞప్తి.. స్పందించిన ప్రధాని మోదీ.. ఇంతకీ ఏం జరిగిందంటే?

  • తన తండ్రి చక్కెర తినే అలవాటు మాన్పించాలని ప్రధాని మోదీకి ఓ యువకుడి విజ్ఞప్తి
  • యువకుడి ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ను షేర్ చేసి స్పందించిన ప్రధాని మోదీ
  • చక్కెర వాడకం తగ్గించుకోవాలని యువకుడి తండ్రితో పాటు అందరికీ సూచన
  • ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని, యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపు
సామాజిక మాధ్యమాల్లో ఓ యువకుడు సరదాగా చేసిన విజ్ఞప్తికి ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ స్పందించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తన తండ్రి మితిమీరిన చక్కెర వాడకాన్ని నియంత్రించేందుకు సహాయం చేయాలని కోరుతూ ఓ కంటెంట్ క్రియేటర్ చేసిన వీడియో వైరల్ అయింది. ఈ వీడియో ప్రధాని దృష్టిని ఆకర్షించడంతో ఆయన దానికి ప్రతిస్పందించడమే కాకుండా ప్రజలకు ఒక ముఖ్యమైన ఆరోగ్య సందేశాన్ని కూడా ఇచ్చారు.

వివరాల్లోకి వెళితే... యువరాజ్ దువా అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్.. 'షుగర్ కమ్ కర్వా దో పాపా కీ' (మా నాన్నగారి చక్కెర వాడకం తగ్గించండి) అనే క్యాప్షన్‌తో ఒక ఇన్‌స్టాగ్రామ్ రీల్ పోస్ట్ చేశాడు. తన తండ్రికి ప్రధాని మోదీ అంటే విపరీతమైన అభిమానమని, ఆయన చెప్పిన మాటలను ఆదేశాలుగా భావించి పాటిస్తారని ఆ వీడియోలో సరదాగా చెప్పాడు. అందుకే ప్రధాని మోదీ స్వయంగా చెబితే తన తండ్రి చక్కెర తినడం మానేసి ఆరోగ్యకరమైన అలవాట్లను పాటిస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. భారతదేశంలోని చాలా మంది తండ్రులకు స్నేహితులు, కుటుంబ సభ్యుల కన్నా మోదీయే ఎక్కువ ఇష్టమని, వారి ప్రేమ ర్యాంకింగ్‌లో మోదీ మొదటి స్థానంలో ఉంటారని చమత్కరించాడు.

ఈ వీడియోలోని హాస్యం, వినూత్నతకు ఆకర్షితులైన ప్రధాని మోదీ.. దానిని తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రీషేర్ చేశారు. అంతేకాకుండా యువరాజ్ విజ్ఞప్తికి ప్రతిస్పందిస్తూ ఒక సందేశాన్ని కూడా పోస్ట్ చేశారు. "యువరాజ్ అభ్యర్థన మేరకు అతని తండ్రికి (అలాగే ఇతరులందరికీ) చక్కెర వాడకాన్ని తగ్గించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి" అని మోదీ పేర్కొన్నారు.

ఈ అవకాశాన్ని ప్రజారోగ్యంపై అవగాహన కల్పించేందుకు ప్రధాని మోదీ ఉపయోగించుకున్నారు. అధిక చక్కెర వినియోగం వల్ల అనేక వ్యాధులు వస్తాయని, స్థూలకాయం పెను ముప్పుగా పరిణమిస్తుందని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని సూచించారు. "శరీర దృఢత్వానికి, చురుకుదనానికి యోగా ఒక గొప్ప మార్గం. మీ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకోండి" అని మోదీ తన సందేశంలో పిలుపునిచ్చారు.

ప్రధాని మోదీ తన వీడియోను షేర్ చేయడంతో యువరాజ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. "ఇది నిజంగా నమ్మశక్యంగా లేదు. ఈ వీడియో ఇంత దూరం వెళ్తుందని అస్సలు ఊహించలేదు" అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. "మోదీజీ స్టోరీ చూసి ఇక్కడికి వచ్చాం" అని ఒకరు, "మీ నాన్న చాలా గర్వపడతారు" అని మరొకరు కామెంట్ చేశారు. "మీ రీల్‌కు ప్రభుత్వ ఆమోదం లభించింది" అంటూ మరికొందరు యువరాజ్‌కు అభినందనలు తెలిపారు.

Viral Video
Narendra Modi
Yuvaraj Dua
Sugar Consumption
Social Media Influencer
Health Awareness
Fitness
Yoga
Instagram Reel
Public Health
Obesity

More Telugu News