పాన్ వ్యసనమే శ్రీహరి ప్రాణం తీసిందా? సుద్దాల అశోక్ తేజ ఏం చెప్పారంటే...!
- 'భద్రాచలం' సినిమాలో బలంగా కనిపించిన శ్రీహరి
- 'మేస్త్రి' సినిమా సమయానికి చాలా సన్నబడ్డారన్న సుద్దాల అశోక్ తేజ
- పాన్ అలవాటే ఆయన మరణానికి కారణమైందని తమకు తర్వాత తెలిసిందని వెల్లడి
- తోటి వారిని ఆదుకునే గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి శ్రీహరి అని కితాబు
- శ్రీహరి ఇచ్చిన ధైర్యమే తన జీవితం ముందుకు సాగడానికి కారణమన్న సుద్దాల
టాలీవుడ్ ప్రేక్షకులకు 'మగధీర' షేర్ ఖాన్ గా, పేదల పాలిట పెన్నిధిగా సుపరిచితుడైన దివంగత నటుడు శ్రీహరి మరణం ఇప్పటికీ ఒక తీరని లోటు. అయితే, అప్పటివరకు ఎంతో ఆరోగ్యంగా, కండలు తిరిగిన శరీరంతో ఉన్న శ్రీహరి.. ఒక్కసారిగా సన్నబడి మరణించడానికి గల కారణాన్ని గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ బయటపెట్టారు. శ్రీహరి మృతికి ఆయనకు ఉన్న పాన్ తినే అలవాటే ప్రధాన కారణమని అశోక్ తేజ తెలిపారు.
సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ... "'మేస్త్రి' సినిమా సమయానికి శ్రీహరి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. అంతకుముందు 'భద్రాచలం' సినిమాలో ఎంతో పుష్టిగా, బలంగా కనిపించిన ఆయన... ఆ తర్వాత చాలా సన్నబడ్డారు. అతిగా పాన్ తినడం వల్లే ఆయన కాలేయం తీవ్రంగా దెబ్బతిన్నదని, అదే ఆయన మరణానికి దారితీసిందని మాకు తర్వాత తెలిసింది" అని ఆవేదన వ్యక్తం చేశారు.