తమిళనాడులో వాహనాలపైకి దూసుకెళ్లిన బస్సు.. ఎనిమిది మంది మృతి

Tamil Nadu Road Accident Bus collision kills eight
  • సేలం సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
  • అదుపుతప్పి మరో లైన్‌లోకి వెళ్లి వాహనాలను ఢీకొట్టిన బస్సు
  • ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
తమిళనాడు రాష్ట్రం, సేలం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిలో ఉత్తమసోలాపురం సమీపంలోని అరియనూర్ వద్ద తమిళనాడు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొట్టడంతో ఎనిమిది మంది మృతి చెందారు.

కోయంబత్తూరు నుంచి సేలంకు ప్రయాణిస్తున్న ఈ బస్సులో 40 మంది ఉన్నారు. ఈ బస్సు అదుపు తప్పి అవతలి లైన్‌ను దాటుకుని మరో లైన్‌లోకి వచ్చి ఎదురుగా వెళుతున్న వాహనాలను ఢీకొట్టింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.

ఈ బస్సు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న గూడ్స్ ఆటోను, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఆటోలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది ప్రయాణిస్తున్నారు. వీరంతా ఓ ఫంక్షన్‌కు వెళ్లి వస్తున్నారు. ద్విచక్ర వాహనంపై ఓ మహిళ, ఆమె కూతురు ఉన్నారు. ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు, ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇద్దరు మృతి చెందారు.

మృతి చెందినవారిని సెల్వరాజ్, మురుగన్, అముధ, మణికందన్, ఇరుసాయి, సత్య (మణికందన్ భార్య), ఐదేళ్ల నితీష, 11 నెలల జీవికగా గుర్తించారు. మిగిలిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బస్సులోని కొంతమంది ప్రయాణికులు గాయపడగా, వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతివేగం కారణంగా డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
Go Back to Shorts
Tamil Nadu Road Accident
Salem
Bus Accident
Road Accident
Tamil Nadu
Accident

More Telugu News