విద్యావిధానంలో మార్పులు... ఇక టెన్త్ పరీక్షలు ఉండవు: రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

  • ఫోన్ ట్యాపింగ్, జీవన్ రెడ్డి వ్యవహారంపై కూడా స్పందించిన ముఖ్యమంత్రి
  • ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టులు కొనసాగుతాయన్న ముఖ్యమంత్రి
  • విద్యా విధానంలో మార్పులు తెస్తున్నామని వెల్లడి
  • జీవన్ రెడ్డి వ్యవహారాన్ని టీపీసీసీ చీఫ్, ఇంఛార్జ్ చూసుకుంటారని స్పష్టీకరణ
ఫోన్ ట్యాపింగ్ అరెస్టులు, సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి వ్యవహారం, విద్యా విధానం అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడిన ఆయన, విద్యా విధానంలో కీలక మార్పులు తెస్తున్నామని స్పష్టం చేశారు. ఇక టెన్త్ పరీక్షలు ఉండవని చెప్పారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విధానం ఉంటుందని, దీనిని మున్ముందు అమలుచేస్తామని అన్నారు. మూసీ ప్రక్షాళన ఆగదని, ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. జగిత్యాలకు చెందిన తమ పార్టీ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి వ్యవహారాన్ని టీపీసీసీ అధ్యక్షుడు, పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ చూసుకుంటారని తెలిపారు.

అటు, ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టులు కొనసాగుతాయని తెలిపారు. చట్టప్రకారమే ఈ దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు. విద్యావిధానంలో మార్పులు చేస్తున్నామని, ఇక పదో తరగతి బోర్డు పరీక్షలు ఉండబోవని అన్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టులు ఏవని విపక్షాలు ప్రశ్నిస్తుండటంపై కూడా ముఖ్యమంత్రి స్పందించారు. విచారణ జరపకుండానే అరెస్టులు చేయలేం కదా అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని హరీశ్ రావు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీశ్ రావుకు సిద్దిపేటకు చెందిన చక్రధర్ కేసులోనే క్లీన్ చిట్ వచ్చిందని తెలిపారు.

పదేళ్లు బీఆర్ఎస్ చేసిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తున్నామని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లు చేసిన తప్పులకు చెవిలో పువ్వులు కాదని, వీపుపై బండలు పెట్టాలని అన్నారు. ఫార్ములా ఈ-రేసు కేసులో విచారణకు ఇటీవల కేంద్రం అనుమతి ఇచ్చిందని, ఇప్పటికే అరవింద్ కుమార్‌ను సస్పెండ్ చేశామని అన్నారు.



Revanth Reddy
Telangana
Phone Tapping Case
Harish Rao
BRS Loans
Telangana Education System

More Telugu News