మల్లు భట్టి విక్రమార్క ప్రసంగం కొనసాగుతుండగానే... బీఆర్ఎస్ వాకౌట్

  • చెవిలో పువ్వులు పెట్టుకుని సభలోకి వచ్చిన బీఆర్ఎస్ సభ్యులు
  • బడ్జెట్ ప్రసంగం మొదలుకాగానే స్పీకర్ పోడియం వద్దకు వెళ్లన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
  • ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా కొనసాగాయి. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈరోజు అసెంబ్లీలో తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించగానే.. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఊహించని రీతిలో నిరసన వ్యక్తం చేసింది. ప్రభుత్వం ప్రజల 'చెవిలో పూలు' పెట్టి మోసం చేస్తోందని అంటూ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా తమ చెవుల్లో రంగు రంగుల పువ్వులు పెట్టుకుని సభలోకి వచ్చారు. 


బడ్జెట్ ప్రసంగం మొదలవ్వగానే బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. ఆరు గ్యారంటీలు ఏమయ్యాయి? నిరుద్యోగ భృతి ఎక్కడ? రెండు లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? అంటూ నినాదాలతో సభను హోరెత్తించారు. భట్టి విక్రమార్క ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ నేతలు, అనంతరం నిరసనగా సభ నుండి వాకౌట్ చేశారు.


సభ నుంచి బయటకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభ ఎంట్రీ గేట్ వద్ద బైఠాయించి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. "పెళ్లి చేసుకునే ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని చెప్పి ఇప్పుడు మొహం చాటేస్తున్నారు. ఇది పేద మహిళలను వంచించడమే" అని ధ్వజమెత్తారు. రెండు లక్షల ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం మాట తప్పిందని, యువతను నట్టేట ముంచిందని ఆరోపించారు. ఈ బడ్జెట్‌లో రైతులు, మహిళలు, నిరుద్యోగులకు కేటాయింపులు నామమాత్రంగానే ఉన్నాయని, ఇది కేవలం అంకెల గారడీ మాత్రమేనని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు.


MALLU BHATTI VIKRAMARKA
Telangana Assembly
BRS Walkout
Telangana Budget 2024
Revanth Reddy Government
BRS Protest
Unemployment Allowance
Two Lakh Jobs Promise
Six Guarantees
Telangana Politics

More Telugu News