తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ... శిలాతోరణం వరకు క్యూలైన్లు

  • తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
  • శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం
  • వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దాటిన క్యూలైన్లు
  • గురువారం 57,272 మందికి శ్రీవారి దర్శనం
  • రూ. 3.37 కోట్లుగా నమోదైన హుండీ ఆదాయం
తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న ఉగాది పర్వదినం సందర్భంగా స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలిరావడంతో కొండపై రద్దీ వాతావరణం నెలకొంది. 

టీటీడీ వెల్లడించిన వివరాల ప్రకారం, మార్చి 19వ తేదీ గురువారం నాడు మొత్తం 57,272 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 23,842 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఒక్కరోజే శ్రీవారి హుండీకి రూ. 3.37 కోట్ల కానుకలు లభించాయి. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అంతకుముందు రోజు (మార్చి 18) 72,332 మంది శ్రీవారి దర్శనం చేసుకున్నారు.

ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి (ఎస్ఎస్ డీ టోకెన్లు లేనివారికి) సుమారు 18 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు తెలిపారు.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోవడంతో, క్యూలైన్లు వెలుపల దాదాపు కిలోమీటరు దూరంలోని శిలాతోరణం వరకు విస్తరించాయి. భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షిస్తున్నారు.

Tirumala
Tirumala Temple
TTD
Srivari Darshan
Ugadi Festival
Devotees Rush
Sila Thoranam
Vaikuntam Queue Complex
Andhra Pradesh Temples

More Telugu News