నేను తెలంగాణ కోడలిని.. నా ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోండి: గద్దర్ అవార్డుల వేడుకలో రష్మిక భావోద్వేగం

  • ఉత్తమ నటిగా అవార్డును అందుకున్న రష్మిక మందన్న
  • గతంలో తన నటనపై ఎన్నో విమర్శలు వచ్చాయన్న రష్మిక
  • తీవ్రమైన ట్రోల్స్ ఎదుర్కొన్నానని వెల్లడి
  • ఇప్పుడు అవార్డు అందుకోవడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని వ్యాఖ్య

పద్నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణ ప్రభుత్వం 'గద్దర్ సినీ పురస్కారాల' పేరుతో పునఃప్రారంభించిన సినీ అవార్డుల వేడుక వరుసగా రెండో ఏడాది కూడా అత్యంత వైభవంగా జరిగింది. ఉగాది పర్వదినం సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకలో టాలీవుడ్ నటి రష్మిక మందన్న ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 'గర్ల్ ఫ్రెండ్' చిత్రంలో తన అద్భుత నటనకు గాను ఆమె ఉత్తమ నటిగా అవార్డును అందుకుంది.


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్న అనంతరం రష్మిక ప్రసంగిస్తూ భావోద్వేగానికి గురయింది. "గతంలో నా నటనపై ఎన్నో విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోల్స్ ఎదుర్కొన్నాను. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నా ప్రతిభను గుర్తించి, ఈ గౌరవాన్ని అందించడం నాపై ఉన్న బాధ్యతను పెంచింది. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం నా జీవితంలో మర్చిపోలేని అనుభూతి" అని ఆమె పేర్కొంది.


ఇటీవల టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండను వివాహం చేసుకున్న రష్మిక, తన ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలు అందరి హృదయాలను హత్తుకున్నాయి. "ఇప్పటివరకు నన్ను మీ ఇంటి ఆడబిడ్డలా, కూతురిలా ఆదరించారు. కానీ ఇప్పుడు నేను తెలంగాణ కోడలిగా మీ ముందుకు వచ్చాను. నా ఫ్యామిలీని (దేవరకొండ కుటుంబం) మీరందరూ జాగ్రత్తగా చూసుకోండి" అని ఆమె అనగానే సభా ప్రాంగణం మొత్తం హర్షధ్వానాలతో మారుమోగిపోయింది. రష్మిక మాటలకు గ్యాలరీలో ఉన్న విజయ్ దేవరకొండ తల్లి కూడా భావోద్వేగానికి గురి కావడం అక్కడున్న వారిని కదిలించింది.


Rashmika Mandanna
Gaddar Awards
Telangana
Vijay Deverakonda
Girlfriend Movie
Tollywood
Revanth Reddy
Telugu Cinema
Best Actress Award

More Telugu News