ఇరాన్ దాడితో ఖతార్‌కు భారీ నష్టం.. మరమ్మతులకే 5 ఏళ్లు పడుతుందన్న ఖతార్

  • ఐదేళ్ల పాటు 17 శాతం ఉత్పత్తి సామర్థ్యం దెబ్బతిన్నట్లేనన్న ఖతార్
  • ఈ దాడి వల్ల 20 బిలియన్ డాలర్ల మేర నష్టం జరిగినట్లు వెల్లడి
  • ఎల్ఎన్‌జీ సరఫరాకు ఇబ్బందులు ఏర్పడతాయని వివరణ
ఇరాన్ దాడుల కారణంగా ఖతార్‌కు భారీ నష్టం సంభవించింది. ఖతార్ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఇంధన ఉత్పత్తి క్షేత్రాలపై ఇరాన్ దాడులు చేయడం వల్ల, లిక్విఫైడ్ నేచరల్ గ్యాస్ (ఎల్ఎన్‌జీ) ఎగుమతుల్లో 17 శాతం వరకు ఉత్పత్తి చేసే కేంద్రాలు దెబ్బతిన్నాయని ఖతార్ ఎనర్జీ సీఈవో సాద్ అల్కాబీ వెల్లడించారు. ఈ దాడి వల్ల 20 బిలియన్ డాలర్ల మేర నష్టం జరిగిందని, ఈ కేంద్రాల మరమ్మతుకు 5 ఏళ్లు పడుతుందని తెలిపారు.

ఖతార్ ఇంధన ఉత్పత్తి మౌలిక సదుపాయాలపై జరిగిన దాడుల కారణంగా రాస్ లఫాన్ కేంద్రంలోని రెండు ఎల్ఎన్‌జీ ఉత్పత్తి కేంద్రాలు, ఒక గ్యాస్ టు లిక్విడ్స్ కేంద్రం దెబ్బతిన్నదని పేర్కొన్నారు. ఈ దాడి వల్ల 12.8 మిలియన్ టన్నుల చమురు ఉత్పత్తి నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. యూరప్, ఆసియాకు ఎల్ఎన్‌జీ సరఫరాలో ఇబ్బందులు ఏర్పడతాయని అన్నారు.

ఖతార్‌లో ఇలాంటి దాడులు జరుగుతాయని అసలు ఊహించలేదని, ఖతార్ ఎనర్జీ సీఈవో అన్నారు. రంజాన్ మాసంలో తమ సోదర దేశం ఇలా చేస్తుందని అనుకోలేదని వాపోయారు. ఎల్‌ఎన్‌జీలకు సంబంధించి ఇటలీ, బెల్జియం, దక్షిణ కొరియా, చైనాలతో కుదుర్చుకున్న ఒప్పందాలపై ప్రభావం పడుతుందని అన్నారు. దెబ్బతిన్న కేంద్రాల నిర్మాణానికి 26 బిలియన్ డాలర్ల ఖర్చు అవుతుందని వెల్లడించారు. ఐదేళ్ల పాటు 17 శాతం ఉత్పత్తి సామర్థ్యం దెబ్బతిన్నట్లే అన్నారు.

Saad Al-Kaabi
Qatar
Iran
LNG
Qatar Energy
Liquefied Natural Gas
Ras Laffan
Oil Production
Middle East Conflict
Energy Exports

More Telugu News