తెలంగాణ సీఎస్ పదవీకాలం మరోసారి పొడిగింపు.. రేవంత్ సర్కార్ విన్నపానికి కేంద్రం ఆమోదం!

  • మార్చి 31తో ముగుస్తున్న సీఎస్ రామకృష్ణారావు పదవీకాలం
  • జూన్ నెలాఖరు వరకు ఆయన పదవీకాలం పొడిగింపు
  • కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అందిన అధికారిక ఉత్తర్వులు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు పదవీకాలంపై గత కొన్ని రోజులుగా సాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. ఆయన సర్వీసును మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారిక ఉత్తర్వులు అందాయి.


తాజా పొడిగింపుతో రామకృష్ణారావు జూన్ నెలాఖరు వరకు తెలంగాణ సీఎస్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. వాస్తవానికి ఆయన గతేడాది ఆగస్టు 31నే పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే, రాష్ట్రంలో పాలనాపరమైన అవసరాలు, కీలక ప్రాజెక్టుల అమలు దృష్ట్యా ఆయన సేవలు మరికొంత కాలం అవసరమని భావించిన రేవంత్ సర్కార్, గతంలోనే ఏడు నెలల పొడిగింపు కోరింది. ఆ గడువు ఈ ఏడాది మార్చి 31తో ముగియనుండటంతో... ఆయన పదవీకాలాన్ని మరోసారి పొడిగించాలని ప్రభుత్వం మరోసారి కేంద్రానికి విన్నవించింది. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం, మరో మూడు నెలలు పొడిగించింది.


రాష్ట్రంలో ప్రస్తుతం అనేక సంక్షేమ పథకాలు, ముఖ్యంగా 'రైతు భరోసా' నిధుల విడుదల (మార్చి 22), ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీల ప్రారంభం వంటి కీలక ఘట్టాలు జరుగుతున్న తరుణంలో సీఎస్ మార్పు సరికాదని ప్రభుత్వం భావించినట్లు తెలుస్తోంది. రామకృష్ణారావుకు ఉన్న అనుభవం దృష్ట్యా ఆయన కొనసాగింపు ప్రభుత్వానికి పెద్ద ఊరటనిచ్చే అంశం.

Ramakrishna Rao
Telangana CS
Chief Secretary Telangana
Revanth Reddy
Telangana Government
CS Extension
Raitu Bharosa
Oil Palm Factories
Telangana News
Government Schemes Telangana

More Telugu News