పవన్ కల్యాణ్ తో గంటన్నర పాటు బాలినేని భేటీ.. వేడెక్కిన ప్రకాశం జిల్లా రాజకీయం!

  • తాడేపల్లిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో కీలక భేటీ
  • పవన్ వద్దకు తన కుమారుడిని కూడా తీసుకెళ్లిన బాలినేని
  • పవన్ తో తండ్రీకొడుకుల ఏకాంత చర్చలు
  • నాలుగు రోజుల్లో మళ్లీ కలుద్దామని చెప్పిన జనసేనాని
  • బాలినేనికి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, తాజాగా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో సుమారు గంటన్నర పాటు సాగిన ఈ చర్చలు, ప్రకాశం జిల్లా రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చివేసేలా కనిపిస్తున్నాయి.


ఈ భేటీలో అందరినీ ఆకర్షించిన ప్రధానాంశం... బాలినేని తన కుమారుడు ప్రణీత్ రెడ్డిని కూడా పవన్ కల్యాణ్‌ వద్దకు తీసుకెళ్లడం. ఒంగోలు రాజకీయాల్లో తన పట్టును నిలుపుకుంటూనే, తన రాజకీయ వారసుడి భవిష్యత్తుకు జనసేన వేదికగా బాటలు వేయాలని బాలినేని భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. తండ్రీకొడుకులిద్దరూ పవన్‌తో ఏకాంతంగా చర్చలు జరపడం వెనుక భవిష్యత్ కార్యాచరణపై ఒక అవగాహన కుదిరినట్లు సమాచారం.


వైసీపీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహితుడు, స్వయానా బంధువు అయిన బాలినేని, ఆ పార్టీని వీడటం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. అయితే, జనసేనలో చేరిన తర్వాత పార్టీలో ఆయనకు తగిన గుర్తింపు దక్కడం లేదనే అసంతృప్తి ఒకానొక దశలో వినిపించినా, తాజా భేటీతో ఆ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి.


గంటన్నర చర్చల అనంతరం.. 'మరో నాలుగు రోజుల్లో మళ్ళీ కలుద్దాం' అని పవన్ కల్యాణ్ స్వయంగా చెప్పడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. ఆ నాలుగు రోజుల్లో ప్రకాశం జిల్లా బాధ్యతలు లేదా కీలక పదవిపై ఒక స్పష్టమైన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


Balineni Srinivasa Reddy
Pawan Kalyan
Janasena
Andhra Pradesh Politics
Prakasam District
Praneeth Reddy
Ongole
YSRCP
Political Meeting

More Telugu News