వాణిజ్య ఎల్పీజీ వాడకంపై కేంద్రం కీలక నిర్ణయం

  • దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదని చెప్పిన కేంద్రం
  • ఆందోళనతో కొనుగోళ్లు చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి
  • వాణిజ్య ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మారే రాష్ట్రాలకు ప్రోత్సాహం
  • దేశీయంగా 40 శాతం పెరిగిన ఎల్పీజీ ఉత్పత్తి
  • సాధారణంగానే కొనసాగుతున్న గ్యాస్ సిలిండర్ల డెలివరీలు
దేశంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ (ఎల్పీజీ)కు ఎలాంటి కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజలు ఆందోళనతో అనవసరంగా ఇంధనాన్ని కొనుగోలు చేయవద్దని, సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని భరోసా ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ ఇవాళ‌ ఒక ప్రకటన విడుదల చేసింది.

దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తిని దాదాపు 40 శాతం పెంచినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎల్పీజీ సిలిండర్ల డెలివరీలు యథాతథంగా కొనసాగుతున్నాయని, పక్కదారి పట్టకుండా నిరోధించేందుకు ఆన్‌లైన్ బుకింగ్‌లు, డెలివరీ అథెంటికేషన్ కోడ్ (DAC) వాడకాన్ని పెంచామని వివరించింది. దేశీయ అవసరాలకు సరిపడా పెట్రోల్, డీజిల్ ఉత్పత్తి జరుగుతోందని, వీటి దిగుమతుల అవసరం లేదని పేర్కొంది.

అదే సమయంలో వాణిజ్య ఎల్పీజీ వాడకాన్ని తగ్గించి, పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) వైపు మళ్లేలా ప్రోత్సహించే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 10 శాతం అదనపు వాణిజ్య ఎల్పీజీ కోటాను కేటాయించనున్నట్లు ప్రకటించింది. హోటళ్లు, రెస్టారెంట్లు, ఆసుపత్రులు వంటి వాణిజ్య సంస్థలు పీఎన్జీ కనెక్షన్లు తీసుకోవాలని సూచించింది. ఇందుకోసం సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) కంపెనీలు ప్రోత్సాహకాలు కూడా అందిస్తున్నాయని తెలిపింది.

ప్రత్యామ్నాయ వంట ఇంధనంగా రాష్ట్రాలకు అదనంగా 48,000 కిలోలీటర్ల కిరోసిన్‌ను కేటాయించామని, గృహ అవసరాలు, సీఎన్జీ రవాణా వంటి కీలక రంగాలకు గ్యాస్ సరఫరాలో ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా సీజీడీ నెట్‌వర్క్‌ను విస్తరిస్తూ, పరిశుభ్రమైన ఇంధన వాడకాన్ని ప్రోత్సహించడమే లక్ష్యమని ప్రభుత్వం వివరించింది.

LPG
Petroleum Ministry
LPG shortage
PNG
cooking gas
fuel
petrol
diesel
kerosene
CGD

More Telugu News