మూడేళ్లలో పేదల సొమ్ము రూ. 19 వేల కోట్లను బ్యాంకులు దోచుకున్నాయి: ఎంపీ రాఘవ్ చద్ధా

  • బ్యాంకుల మినిమం బ్యాలెన్స్ దోపిడిపై పార్లమెంట్ వేదికగా రాఘవ్ చద్ధా ఆగ్రహం
  • కూలీలు, రైతులు, పెన్షనర్ల కష్టాన్ని బ్యాంకులు దోచేస్తున్నాయని మండిపాటు
  • పేదలకు అండగా నిలవాల్సిన బ్యాంకులు పెనాల్టీలు వేయడంపై ఆవేదన
  • ఈ పెనాల్టీలను రద్దు చేయాలంటూ కేంద్రం, ఆర్బీఐని డిమాండ్ చేసిన రాఘవ్

పార్లమెంట్ వేదికగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్ధా 'మినిమం బ్యాలెన్స్' పెనాల్టీల అంశంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న ఈ నిశ్శబ్ద దోపిడీపై ఆయన అందించిన గణాంకాలు విస్తుగొలుపుతున్నాయి.


బ్యాంకు ఖాతాల్లో కనీస నిల్వ (మినిమం బ్యాలెన్స్) లేదనే నెపంతో గత మూడేళ్లలో బ్యాంకులు ఏకంగా రూ.19 వేల కోట్లు వసూలు చేశాయని రాఘవ్ చద్ధా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ భారీ మొత్తం అపర కోటీశ్వరుల జేబుల నుంచి వచ్చింది కాదని, రెక్కాడితే గానీ డొక్కాడని రోజువారీ కూలీలు, రైతులు, తమ మందుల ఖర్చుల కోసం పైసా పైసా పోగేసుకునే పెన్షనర్ల కష్టార్జితమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ బ్యాంకులు రూ.11 వేల కోట్లు, ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.8 వేల కోట్లు ఈ రూపంలో వసూలు చేశాయని దుయ్యబట్టారు.


ఈ జరిమానాలను 'పేదరికంపై వేసిన పన్ను'గా ఆయన అభివర్ణించారు. ఒక సామాన్యుడు తన అత్యవసర ఖర్చుల కోసం అకౌంట్ ఖాళీ చేసినప్పుడు, అతనికి అండగా ఉండాల్సిన బ్యాంకులు రివర్స్‌లో వందల రూపాయల పెనాల్టీలు వేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. జన్ ధన్ ఖాతాలకు మినహాయింపు ఉన్నప్పటికీ, కోట్లాది మంది సామాన్య సేవింగ్స్ ఖాతాదారులపై ఈ భారం పడుతోందని ధ్వజమెత్తారు. ఈ పెనాల్టీలను తక్షణమే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐని ఆయన డిమాండ్ చేశారు.


Raghav Chadha
Aam Aadmi Party
Minimum Balance Penalty
Bank Charges
Poor People
Banking System
Jan Dhan Account
RBI
Indian Banks

More Telugu News