సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు.. రేణు దేశాయ్ కేసులో ఇద్దరి అరెస్ట్!

  • అశ్లీల కామెంట్లపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు రేణు దేశాయ్ ఫిర్యాదు
  • నాలుగు సోషల్ మీడియా అకౌంట్లపై ఫిర్యాదు చేసిన రేణు
  • ఇద్దరి అరెస్ట్... మరో ఇద్దరి కోసం గాలిస్తున్న పోలీసులు
  • అనసూయను వేధించిన కేసులో కూడా ఒకరి అరెస్ట్
  • తప్పుడు పనులు చేసే వారు ఎక్కడున్నా పట్టుకుంటామని పోలీసుల హెచ్చరిక
  • వేధింపులకు గురయ్యే సామాన్య మహిళలు కూడా ఫిర్యాదు చేయాలని సూచన

సోషల్ మీడియా వేదికగా మహిళలను, సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న వారిపై సైబరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ముఖ్యంగా నటి రేణు దేశాయ్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగిన పోలీసులు... నిందితులను కటకటాల వెనక్కి నెట్టారు.


గత కొంతకాలంగా తనపై వస్తున్న అశ్లీల కామెంట్లు, వ్యక్తిగత దూషణలపై రేణు దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇటీవల సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగిస్తూ, అసభ్య పదజాలంతో వేధిస్తున్న నాలుగు సోషల్ మీడియా అకౌంట్లపై ఆమె ఫిర్యాదు చేశారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు, సాంకేతిక ఆధారాల సాయంతో నిందితులను గుర్తించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. మిగిలిన ఇద్దరి కోసం గాలింపును మరింత వేగవంతం చేశారు.


కేవలం రేణు దేశాయ్ మాత్రమే కాకుండా, నటి అనసూయను వేధించిన కేసులోనూ ఒకరిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. "చీకట్లో ఉండి ఫేక్ అకౌంట్లతో కామెంట్లు చేస్తే ఎవరూ పట్టుకోలేరని అనుకోవద్దు.. మీరు ఎక్కడున్నా సాంకేతిక పరిజ్ఞానంతో పట్టుకుంటాం" అంటూ సైబరాబాద్ పోలీసులు కేటుగాళ్లకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. సెలబ్రిటీలే కాకుండా సామాన్య మహిళలు కూడా ఇటువంటి వేధింపులకు గురైతే... వెనుకాడకుండా ఫిర్యాదు చేయాలని సూచించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మహిళలకు పోలీసులు భరోసా ఇచ్చారు.

Renu Desai
Renu Desai cyber crime
cyber crime
social media abuse
Anasuya
cyberabad police
social media harassment
online harassment
cyber crime investigation
telugu actress

More Telugu News