జగన్ చేయగలిగింది బాబు ఎందుకు చేయలేకపోతున్నాడనే చర్చ జరుగుతోంది: జగన్

  • ఒంగోలు నియోజకవర్గ కేడర్‌తో జగన్ భేటీ 
  • గుండె ధైర్యమే వైసీపీ ట్రేడ్ మార్క్ అని ఉద్ఘాటన
  • వైసీపీ పాలనకు, బాబు పాలనకు మధ్య తేడాను ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్య
  • అమరావతి పనుల్లో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని ఆరోపణ
  • రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందని ఆవేదన

తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నేడు ఒంగోలు నియోజకవర్గ కేడర్‌తో భేటీ అయిన వైసీపీ అధినేత జగన్... కూటమి ప్రభుత్వంపై తన విమర్శనాస్త్రాలకు మరింత పదును పెట్టారు. వైసీపీకి 'గుండె ధైర్యం' అనేది ఒక ట్రేడ్‌ మార్క్ అని... విలువలు, విశ్వసనీయతే పార్టీకి పునాదులని ఆయన అన్నారు.


తమ ఐదేళ్ల పాలనకు, ప్రస్తుత చంద్రబాబు పాలనకు మధ్య ఉన్న తేడాను ప్రజలు ఇప్పటికే గమనిస్తున్నారని జగన్ పేర్కొన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు కోవిడ్ వంటి కష్టాలు ఎదురైనా, ఆర్థిక ఒత్తిళ్ల మధ్య కూడా ఇచ్చిన మాట తప్పకుండా సంక్షేమ పథకాలను క్యాలెండర్ ప్రకారం అమలు చేశామని గుర్తు చేశారు. సుమారు రూ. 2.7 లక్షల కోట్లను నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి చేరవేశామని, కానీ ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలోనే అప్పులు రూ. 3.30 లక్షల కోట్లు దాటాయని విమర్శించారు.

జగన్ చేయగలిగింది బాబు ఎందుకు చేయలేకపోతున్నాడు? అనే చర్చ ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ జరుగుతోందని ఆయన అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 'దోచుకో.. పంచుకో.. తినుకో..' అనే విధానం సాగుతోందని, అమరావతి పనుల్లో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం రావడం లేదని, ఆర్థిక పరిస్థితి అధ్వానంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం అవినీతి కోసమే వారు అధికారంలో ఉన్నారని, ఎన్నికల హామీలను గాలికొదిలేశారని మండిపడ్డారు. ఈ భేటీలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Jagan Mohan Reddy
YS Jagan
Chandrababu Naidu
Andhra Pradesh Politics
YSRCP
TDP
AP Government
Ongole
Corruption
Welfare Schemes

More Telugu News