పుట్టా మహేశ్ డ్రగ్స్ వ్యవహారం.. చంద్రబాబుపై జగన్ ఫైర్

  • పార్లమెంట్ చరిత్రలో డ్రగ్స్ తీసుకుంటూ దొరికిన తొలి ఎంపీ పుట్టా మహేశ్ అన్న జగన్
  • ఇలాంటి వారిపై చంద్రబాబు చర్యలు తీసుకోవడం లేదని విమర్శ
  • రాష్ట్రంలో డ్రగ్స్ దందా విచ్చలవిడిగా సాగుతోందని ఆరోపణ
  • కూటమి ప్రభుత్వానికి మిగిలింది రెండేళ్లేనని వ్యాఖ్య
  • మధ్యలో తాను పాదయాత్ర చేపడతానన్న జగన్

కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్లమెంట్ చరిత్రలోనే డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ మొదటి ఎంపీ టీడీపీకి చెందిన పుట్టా మహేశ్ అని విమర్శించారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే రాష్ట్రంలో డ్రగ్స్ దందా విచ్చలవిడిగా సాగుతోందని మండిపడ్డారు.


బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు పట్టుబడినప్పుడు కూడా ప్రభుత్వం మౌనంగా ఉండిపోయిందని జగన్ దుయ్యబట్టారు. కేవలం డ్రగ్స్ మాత్రమే కాకుండా, మహిళలపై జరుగుతున్న దాడుల విషయంలోనూ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. కోనేటి ఆదిమూలం వంటి వారు మహిళలపై లైంగిక దాడులకు పాల్పడినా, కూన రవికుమార్ వంటి వారు వేధింపులకు దిగినా చర్యలు లేవని, కేవలం కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఫైర్ అయ్యారు.


చంద్రబాబు మైండ్‌సెట్ వల్లే రాష్ట్రంలో ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయని జగన్ దుయ్యబట్టారు. తప్పు చేసిన వాళ్లపై చంద్రబాబు చర్యలు తీసుకోలేదని... అందుకే దురాగతాలు పెరుగుతున్నాయని విమర్శించారు. "అమ్మాయిలకు ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలి" అని బాలకృష్ణ వ్యాఖ్యలు చేశారని, గతంలో చంద్రబాబు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.


కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయ్యాయని, ఇక మిగిలింది కేవలం రెండేళ్లేనని, చివరి ఏడాది ఎన్నికలు జరుగుతాయని జగన్ అన్నారు. ఈ మధ్యలో తాను పాదయాత్ర కూడా చేపడతానని తెలిపారు. 'జగన్ 2.O' లో కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తానని, వారి ద్వారానే ప్రజలకు మరింత చేరువవుతామని స్పష్టం చేశారు.


Jagan Mohan Reddy
Putta Mahesh
Andhra Pradesh Drugs Case
Chandrababu Naidu
TDP
YSRCP
Adinarayana Reddy
Koonna Ravi Kumar
AP Politics
Jagan Padayatra

More Telugu News