పండ్లు కాసే సమయంలో రాష్ట్రాన్ని కసాయికి అప్పగించొద్దు: రామ్మోహన్ నాయుడు

  • వికసిత్ భారత్ దిశగా దేశం దూసుకుపోతోందన్న రామ్మోహన్ నాయుడు
  • కేంద్ర బడ్జెట్ లో ఏపీకి పెద్ద పీట వేశారని కితాబు
  • కూటమి ప్రభుత్వం అనేక ప్రాజెక్టులను సాధించిందని వ్యాఖ్య
బడ్జెట్ లో ఏపీకి పెద్ద పీట వేశారని... రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులకు రూ. 10,134 కోట్లు, అమరావతి కోసం రూ. 1,120 కోట్లు కేంద్ర బడ్జెట్ లో కేటాయించారని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. కేంద్రం సాయంతో ఏపీలోని కూటమి ప్రభుత్వం అనేక ప్రాజెక్టులను సాధించిందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు కేంద్రం నిధులు ఇస్తోందని తెలిపారు. రాష్ట్రానికి బలమైన పునాదులు పడుతున్నాయని... పండ్లు కాసే సమయంలో రాష్ట్రాన్ని కసాయికి అప్పగించవద్దని పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ఎన్నో విజయాలను సాధిస్తోందని రామ్మోహన్ నాయుడు కొనియాడారు. వికసిత్ భారత్ దిశగా దేశం దూసుకుపోతోందని అన్నారు. రాజకీయాలను పక్కన పెట్టి, దేశ శ్రేయస్సే లక్ష్యంగా మోదీ ముందుకు సాగుతున్నారని చెప్పారు. దేశ ప్రజల భవిష్యత్తును నిర్దేశించే విధంగా, యువత ఆశయాలు, ఆకాంక్షలు ప్రతిబింబించేలా కేంద్ర బడ్జెట్ ఉందని అన్నారు. రాబోయే 20 ఏళ్ల పాటు 7 శాతం వృద్ధి రేటు కొనసాగేలా నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను రూపొందించారని కితాబునిచ్చారు. 



Ram Mohan Naidu
Narendra Modi
Union Budget 2024
Vikshit Bharat
Nirmala Sitharaman
Andhra Pradesh
AP Railway Projects
Amaravati
Polavaram Project
TDP

More Telugu News